కేతేపల్లి (నకిరేకల్), వెలుగు: నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం అగ్నిప్రమాదం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో వివిధ కేసులు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసులు సీజ్ చేసి భద్రపరిచిన సుమారు 30 వాహనాలు కాలిపోయాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం..
పోలీస్ స్టేషన్ సమీపంలోని పొలం వద్ద గడ్డికోయిల ప్రాంతంలో చెలరేగిన మంటలు ఎండ తీవ్రత, గాలి వేగానికి వేగంగా వ్యాపించాయి. స్టేషన్ ఆవరణలో నిలిపిన సీజ్ వాహనాలకు ఆ మంటలు అంటుకున్నాయి. వెహికల్స్లో పెట్రోల్, ఆయిల్ ఉండడంతో మంటలు మరింత ఉధృతమై అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
