సాగర తీరంలో  మరో మణిహారం... విశాఖలో ఫ్లోటింగ్​ బ్రిడ్జి ప్రారంభం

సాగర తీరంలో  మరో మణిహారం... విశాఖలో ఫ్లోటింగ్​ బ్రిడ్జి ప్రారంభం

సాగర నగరం విశాఖ సిగలో మరో మణిహారం వచ్చి చేరింది. ఆర్కే బీచ్ వద్ద రూ.1.60 లక్షల వ్యయంతో నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని  రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్‌లు ఆదివారం( ఫిబ్రవరి 25)    ప్రారంభించారు.   సీఎం జగన్‌ రాష్ట్రంలో వివిధ బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో విశాఖలో పరిపాలన రాజధాని ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. విశాఖ నుంచే ప్రభుత్వం పాలన నడుపుతుందని పునరుద్ఘాటించారు.

విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని అన్నారు. అందమైన బీచ్ లతో విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షిస్తోంది. రామ‌కృష్ణ బీచ్‌, కైలాసగిరి, తోట్లకొండ, డచ్ సమాధులు, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్.. వీటికి తోడు తాజాగా ఫ్లోటింగ్ బ్రిడ్జి మరో ఆకర్షణగా మారనుంది. సముద్రంలో ఎగిసిపడే కెరటాలను దగ్గరగా చూడడంతో పాటు వాటిపై తేలియాడవచ్చు. పర్యాటకులకు ఇదొక మరపురాని అనుభూతిగా మిగులనుంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది.