దుమ్ముగూడెం ఆనకట్టపై పెరిగిన వరద... సీతమ్మ సాగర్ పనులకు బ్రేక్

దుమ్ముగూడెం ఆనకట్టపై పెరిగిన వరద... సీతమ్మ సాగర్ పనులకు బ్రేక్

అశ్వాపురం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద  గోదావరి నదిపై నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్టపై అకస్మాత్తుగా వరద పెరిగింది. దీంతో సీతమ్మ సాగర్ వంతెన పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ ప్రాజెక్టు పనుల వద్ద కాపర్ వంతెన కోతకు గురైంది. దీంతో వంతెనపై గురు, శుక్రవారాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో మాత్రమే దుమ్ముగూడెం ఆనకట్టపై నుంచి వరద పొంగి ప్రవహిస్తుంది.

వేసవిలో ఈ ఆనకట్ట అశ్వాపురం –దుమ్ముగూడెం మండలాల రవాణాకు వారధిగా ఉంటుంది. రెండు రోజులు కింద ఎగువన ఉన్న సమ్మక్క సారక్క ప్రాజెక్టు నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో ఆనకట్టపై నుంచి వరద పొంగిపొర్లడంతో దిగువన సీతమ్మసాగర్​ ప్రాజెక్టు నిర్మాణ పనుల వద్ద కాపర్ ​వంతెన కోతకు గురైంది. ఏడు అడుగుల వరకు గోదావరి వరద ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు.