హాయ్ రఘు.. ఏంటీ ఇవాళ ఆఫీస్కు రాలేదు. అడిగింది భానుమతి. హాస్పిటల్లో ఉన్నా..! చెప్పాడు రఘు. అయ్యో.. ఏమైంది? ఆందోళనగా అడిగింది భానుమతి. ఫుడ్ పాయిజనంట.. నాలుగు సెలైన్లు ఎక్కాయి. ఇంకా రెండ్రోజులు హాస్పిటల్లోనే ఉండాలంట.
నిజమే.. ఫుడ్పాయిజన్ అనేది చాలామంది కామన్గా ఎదుర్కొనే సమస్య. ఫ్రిజ్లు, ఒవెన్లు వచ్చాక ఫ్రెష్గా వండుకొని తినడం అన్నమాటే మర్చిపోయారు. వండి తినడం మానేసి.. వేడి చేసుకొని తింటున్నారు. ఇలా ఆహారాన్ని నిల్వ ఉంచడం వల్ల అందులో రకరకాల హానికర కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. వేడి చేసుకొని తినడం వల్ల అవి మరింత ప్రమాదకరంగా మారతాయి. తిన్నవెంటనే వాంతులు, విరేచనాలు, వికారం, కడుపుమంట, మైకం, తలతిప్పుతుంది. మగతగా ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు. తెలిసేలోగా ఆస్పత్రి బెడ్పై ఉంటాం.
కొందరికి కొన్నిరకాల ఫుడ్స్ పడవు. అవి తిన్నవెంటనే బాడీలోని రోగనిరోధక శక్తి ఆపోజిట్గా పనిచేయడం మొదలుపెడుతుంది. ఫలితంగా తీవ్రమైన జ్వరం, వాంతులు, విరేచనాలు అవుతాయి. దీన్ని కూడా డాక్టర్లు ఫుడ్పాయిజనింగ్ అనే చెబుతారు. శుభ్రంగా లేని ఆహారం తినడం వల్ల, చేతులు కడుక్కోకుండా తినడం వల్ల, తినే ప్లేటు, పరిసరాలు క్లీన్గా లేకపోయినా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అయిన వెంటనే వాంతులు, విరేచనాలు అవుతాయి. బాడీ డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. నీరసం ఆవరించేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లాలన్న ఆలోచన మినహా మరేమీ తోచదు. కానీ.. ఫుడ్పాయిజన్ లక్షణాలు కనిపిస్తున్న వెంటనే చిన్న చిన్న నేచురల్ చిట్కాలతో డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే బయటపడొచ్చు. మనకు అందుబాటులో ఉండేవాటితోనే ఫుడ్ పాయిజన్ను తగ్గించుకోవచ్చు.
తులసి..
దాదాపు అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. ఫుడ్ పాయిజన్ అనే డౌడొచ్చినా వెంటనే పిడికెడు తులసి ఆకులు తీసుకొని ఓ గ్లాస్ నీళ్లలో వేసి బాగా మరిగించాలి. లేదంటే రసం తీసినా సరే. దానిని అలాగే తాగలేకపోతే కొంచెం తేనె కలుపుకొని తాగాలి. దీనివల్ల ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చే సైడ్ఎఫెక్ట్స్ చాలావరకు తగ్గుతాయి.
కొత్తిమీర..
తులసి రసంలాగే కొత్తిమీర రసం కూడా ఫుడ్ పాయిజన్కు విరుగుడుగా పనిచేస్తుంది. గుప్పెడు కొత్తిమీర తీసుకొని మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసాన్ని నేరుగా తాగొచ్చు. లేదంటే కొంచెం తేనె కలుపుకొని తాగినా పర్వాలేదు. అలా ఇష్టంలేనివాళ్లు నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి కలుపుకొని తాగిన ఫలితం ఉంటుంది.
పెరుగు, మిరియాల పొడి..
రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కొంచెం మిరియాల పొడి, చిటికెడు ఉప్పు కలుపుకొని తాగాలి. ఇలా నాలుగైదుసార్లు తాగితే ఫుడ్ పాయిజన్ వల్ల ఎదురయ్యే సమస్యలన్నీ దూరమవుతాయి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉంటుంది. నీరసం కూడా తగ్గుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లికి బలమైన యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి తగ్గుతుంది. ఇందుకోసం ముందుగా వెల్లుల్లి రసం తీసుకొని అందులో సోయాబీన్ నూనె కలిపి కడుపుపై మసాజ్ చేయాలి. దీనివల్ల కడుపునొప్పి త్వరగా తగ్గుతుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను నేరుగా తిన్నా వికారం, అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి.
అల్లం..
అల్లం కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఎదురయ్యే సైడ్ఎఫెక్ట్స్ను తగ్గిస్తుంది. కొంచెం ఎండిన అల్లం(శొంఠి) తీసుకొని ఓ కప్పు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. చల్లారాక వడపోసి, అందులో కొంచెం తేనె కలుపుకొని తాగాలి. ఫుడ్ పాయిజన్ అయినప్పుడే కాకుండా రోజూ తాగినా పర్వాలేదు. ఈ టీ చేసుకునేంత ఓపిక లేనివాళ్లు ఓ చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకొని నములుతూ ఆ రసాన్ని మింగినా ఫలితం ఉంటుంది.
యాపిల్ సిడార్ వెనిగర్..
ఫుడ్ పాయిజన్ అయినప్పుడు యాపిల్ సిడార్ వెనిగర్ చక్కని పరిష్కారం చూపుతుంది. ఇందులో ఎసిడిక్ లక్షణాన్ని కలిగిఉన్న ఆల్కలీన్ ఉంటుంది. ఓ కప్పు గోరువెచ్చని నీళ్లలో టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ కలుపుకొని తినే ముందు తాగాలి. ఇలా రోజుకు రెండుమూడుసార్లు తాగితే రెండ్రోజుల్లో ఆరోగ్యం కుదుటపడుతుంది.
అరటిపండ్లు..
ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఏది తిన్నా జీర్ణం కావడం కష్టం. తిన్నవెంటనే వాంతులు అవుతాయి. అటువంటి సమయంలో అరటిపండ్లు తింటే వాంతులు, విరేచనాలు కంట్రోల్ అవుతాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఎదురయ్యే సమస్యలను తగ్గిస్తుంది.
నిమ్మరసం..
తినే ఆహారంలో వైరస్, బ్యాక్టీరియాలు చేరడం వల్లే ఫుడ్ పాయిజన్ అవుతుంది. అటువంటప్పుడు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్న నిమ్మరసాన్ని తాగితే సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లలో టీస్పూన్ నిమ్మరసం, స్పూన్ చక్కెర కలుపుకొని తాగాలి. దాహమేసినప్పుడల్లా ఇలా తాగుతూ ఉంటే కేవలం ఒక్క రోజులోనే ఫుడ్ పాయిజన్ సమస్యలన్నీ దూరమైపోతాయి.
జీలకర్ర..
గోరువెచ్చని నీళ్లలో జీలకర్ర పొడి కలుపుకొని తాగినా ఫుడ్ పాయిజన్ సమస్యలు తగ్గిపోతాయి. అవసరమైతే కొత్తిమీర, చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఇంట్లోనే ఫుడ్ పాయిజనింగ్ నుంచి బయటపడేందుకు ఉపయోగపడతాయి. అయితే సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను కలవడం మంచిది. పాయిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అత్యవసర చికిత్స అవసరమవుతుంది. అటువంటి సమయంలో ఇంటి చిట్కాల మీదే ఆధారపడడం సరికాదు.
see also: అర్ధరాత్రి ఓటర్లకు డబ్బుల పంపకం