- ఫారిన్ టూరిస్టులు పెరుగుతున్నరు
- జనవరిలో 8 లక్షల మంది విజిట్ చేశారు: మోడీ
- లాంగ్ టర్మ్ విజన్తోనే టూరిజం అభివృద్ధి
- 50 ప్లేసులను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: ఫారిన్ టూరిస్టులు మన దేశం వైపు చూస్తున్నారని, ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పోయినేడాది జనవరిలో కేవలం 2 లక్షల మంది వస్తే, ఈసారి జనవరిలో ఏకంగా 8 లక్షల మంది వచ్చారని వెల్లడించారు. శుక్రవారం ‘‘డెవలపింగ్ టూరిజం ఇన్ మిషన్ మోడ్” అనే అంశంపై నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ వెబినార్లో మోడీ మాట్లాడారు. టూరిజం అభివృద్ధికి ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, లాంగ్ టర్మ్ విజన్ ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. మన దేశంలో టూరిజం అభివృద్ధికి ఆ విధంగా ఆలోచించాల్సిన, ప్లానింగ్ తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రాజకీయ నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల పాటు రిలీజియస్ సైట్స్ ను పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడా పరిస్థితిని మారుస్తున్నామని, సౌలతులు కల్పిస్తున్నామని, దీంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ‘‘వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ను ఏటా 80 లక్షల మంది దర్శించుకునేవారు. ఆ టెంపుల్ను పునర్నిర్మించినంక పోయినేడాది 7 కోట్ల మందికి పైగా వచ్చారు. కేదార్ నాథ్ కు 5 లక్షల మందే వచ్చేవారు. అక్కడ రీకన్ స్ట్రక్షన్ వర్క్ పూర్తి చేశాక 15 లక్షల మందిదాకా వస్తున్నారు” అని తెలిపారు. పర్యాటకులు తప్పనిసరిగా వెళ్లాలనుకునే విధంగా దేశంలోని 50 టూరిస్టు ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
వెడ్డింగ్ డెస్టినేషన్స్ పై ఫోకస్ పెట్టాలి..
దేశంలో టూరిజం అభివృద్ధికి, వెడ్డింగ్ డెస్టినేషన్స్కూ మన దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని మోడీ చెప్పారు. ‘‘టూరిజం సెక్టార్కు ప్రొఫెషనల్స్ గైడ్స్ అవసరం. ఇందుకు కాలేజీల్లో సర్టిఫికెట్ కోర్సులు పెట్టాలి. టూరిస్టులను ఆకర్షించేలా రాష్ట్రాలు పాలసీలు తేవాలి” అని సూచించారు.