- గోడ దూకి మరీ ఇంట్లో నుంచి తీసుకెళ్లిన సీబీఐ అధికారులు
- కేంద్ర మాజీ మంత్రి ఇంటి దగ్గర రోజంతా హైడ్రామా
- ఇవాళ కోర్టులో హాజరుపర్చే అవకాశం
- బెయిల్ పిటిషన్ను శుక్రవారం విచారిస్తామన్న సుప్రీం
- ఆ వెంటనే కాంగ్రెస్ ఆఫీసులో ప్రత్యక్షమైన మాజీ మంత్రి
- తానే తప్పూ చేయలేదని మీడియాకు వివరణ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి భారీ హైడ్రామా నడుమ ఇంటి నుంచి ఆయనను సీబీఐ హెడ్క్వార్టర్స్కు తరలించారు. మంగళవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న చిదంబరం.. బుధవారం సాయత్రం హఠాత్తుగా ఏఐసీసీ ఆఫీసులో ప్రత్యక్షమై మీడియాతో మాట్లాడారు. తానే తప్పూ చేయలేదని, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం ఉందని చెప్పుకున్నారు. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఆయన అజ్ఞాతం వీడక తప్పలేదు.
రోజంతా హైడ్రామా..
ఐఎన్ఎస్ మీడియాలో అక్రమాలు, మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం.. ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ టంకా వాదనలకు సిద్ధమయ్యారు. ఈ పిటిషన్ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్న బెంచ్.. విచారణ కోసం ఈ పిటిషన్ను సీజేఐ రంజన్ గొగోయ్కి పంపుతున్నట్లు తెలిపింది. పిటిషన్లో లోపాలున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గుర్తించడంతో వాటిని సవరించుకుని చిదంబరం తరఫు లాయర్లు లంచ్ తర్వాత మళ్లీ జస్టిస్ రమణ బెంచ్ను ఆశ్రయించారు. లిస్టింగ్ కాని పిటిషన్ను తాము విచారించలేమని, దీనిపై ఉదయమే స్పష్టమైన ఉత్తర్వులిచ్చామని బెంచ్ పేర్కొంది. దీంతో చిదంబరం తరఫు లాయర్లు సీజేఐని కలిసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన అయోధ్య కేసు విచారణలో బిజీగా ఉండటంతో చాలా సేపు ఎదురుచూడాల్సివచ్చింది. సాయంత్రం ఐదు చిదంబరం వ్యవహారంపై సీజేఐ ఆదేశాలిచ్చారు. పిటిషన్ను వెంటనే విచారించలేమని, శుక్రవారం పరిశీలిస్తామని తెలిపారు. మరోవైపు మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన మాజీ మంత్రిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పొందేందుకు కోర్టులో చేసిన ప్రయత్నాల్నీ ఫెయిల్ కావడంతో బుధవారం సాయంత్రానికిగానీ చిదంబరం మీడియా ముందుకొచ్చారు.
నేనే తప్పూ చేయలేదు: చిదంబరం
కాంగ్రెస్ సీనియర్లు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీ, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పలేట్, మల్లికార్జున ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్తో కలిసి మీడియాతో మాట్లాడిన చిదంబరం.. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో తానుగానీ, తన కొడుకుగానీ ఎలాంటి నేరానికి పాల్పడలేదని చెప్పారు.స్వేచ్ఛను పొందడానికి, దాన్ని కాపాడుకోడానికి పోరాటం చేయాల్సిఉంటుందన్నారు. ‘‘గడిచిన 24 గంటల్లో జరిగిన పరిణామాలు చాలా మందిని కన్ఫ్యూజన్కు గురిచేశాయి. దాన్ని తొలగించడానికే మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను నిందితుణ్ని కాను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా నేరానికి పాల్పడలేదు. ఇంతవరకు సీబీఐగానీ, ఈడీగానీ ఎలాంటి చార్జిషీటు దాఖలు చేయలేదు. అలాగే నేను నేరం చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లోనూ ప్రస్తావించలేదు. అయినాసరే మేం తప్పు చేసినట్లు కొందరు దురుద్దేశపూర్వకంగా అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. గతేడాది మే 31, జులై 25న ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ మేరకు గత 15 నెలలుగా నేను కోర్టు కల్పించిన ప్రొటెక్షన్లోనే ఉన్నాను. నాకు ముందస్తు బెయిల్ కొనసాగించే అంశంపై ఈ ఏడాది జనవరి 25న విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్లో ఉంచారు. మళ్లీ ఏడు నెలల తర్వాత మంగళవారం(ఆగస్టు 20న) బెయిల్ నిరాకరిస్తూ జడ్జి తీర్పును వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళదామని లాయర్లైన నా పార్టీ మిత్రులు చెప్పారు. మా పిటిషన్ను వెంటనే విచారించాల్సిందిగా సుప్రీంకోర్టును మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం దాకా పదే పదే రిక్వెస్ట్ చేశాం. ఒకవైపు మా లాయర్లు కోర్టులో ప్రయత్నాలు చేస్తుంటే, నాతో పాటు ఇంకొందరు లాయర్లు పిటిషన్ పేపర్లను ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాం. బుధవారం ఉదయానికిగానీ మా పని పూర్తికాలేదు. రోజంతా ప్రొసీడింగ్స్ను గమనిస్తూ కూర్చున్నా. అలాంటిది నేను కోర్టుకు భయపడి ఎక్కడికో పారిపోయానని, చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్నానని ఏవేవో ప్రచారం చేశారు. బుధవారం మా పిటిషన్ లిస్ట్ కాలేదు. గురువారం కూడా కాదు. శుక్రవారం విచారణ చేపడతామని కోర్టు చెప్పింది’’ అని చిదంబరం చెప్పారు.
కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇమేజ్ను దెబ్బతీయడానికే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థల్ని వాడుకుంటున్న మోడీ సర్కార్ తీరును ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా దీనిపై స్పదించారు. ఏండ్లపాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం అన్యాయమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడేవాళ్లపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని, ఈ వ్యవహారంలో సీబీఐ తీరు అవమానకరంగా ఉందని ప్రియాంక ట్వీట్ చేశారు.