
ముషీరాబాద్, వెలుగు: సకల జనుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కేసీఆర్ ఒక్కడితో కాదని ఉద్యమకారుల వేదిక పేర్కొంది. తొలి, మలి దశ ఉద్యమకారులు, అమరవీరుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని తెలిపింది. దశాబ్ది పేరుతో జరుగుతున్న ఉత్సవాల్లో తెలంగాణ తెచ్చింది తానే అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేకపోతే ఈ నెల 24న ఉద్యమకారులతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది.‘‘తెలంగాణ తెచ్చింది నేనే.. కేసీఆర్ ఉద్యమ అవమానం’’అనే అంశంపై ఆదివారం హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో ఉద్యమకారుల వేదిక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఉద్యమకారుడు, మాజీ మంత్రి విజయ రామారావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నడపలేదని, గతంలో ఎందరో ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేశారన్నారు. 1956, 1969, 1996 ఉద్యమాల్లో కేసీఆర్ పాత్ర శూన్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాకుండా రాజకీయం కోసమే కేసీఆర్ పని చేశారని తెలిపారు. తెలంగాణ తెచ్చింది తానే అనే హక్కు కేసీఆర్కు లేదన్నారు. ‘‘ఉద్యమ సమయంలో నిజాయతీగా పనిచేస్తా.. లేకుంటే రాళ్లతో కొట్టి చంపండి’’అని చెప్పిన కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీకి 300 ఎకరాలు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. నేడు ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని నిర్మించిన సెక్రటేరియెట్కు ప్రజలను, మీడియాను రానివ్వకపోవడం దురదృష్టకరమన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే ఉద్యమంలోకి..
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ పాత్ర నామ మాత్రమేనని టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. ప్రజలు, బలిదాన కర్తలు, సకలజనులు ప్రత్యేక రాష్ట్రం కోసం పని చేశారని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ చరిత్ర కూడా తానే అని చెప్పుకునే ప్రయత్నాలను ఖండిస్తున్నామని చెప్పారు. 2001లో కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారన్నారు. కేసీఆర్ 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారే తప్ప.. అంతకుమించి చేసిందేమీ లేదన్నారు.
‘‘తెలంగాణ తెచ్చింది నేనే అంటే కేసీఆర్ను తరిమి కొడతాం. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలి”అని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో కేంద్ర మంత్రి పదవిలో కేసీఆర్ ఎంజాయ్ చేశారు తప్ప.. ఆయన పడిన కష్టం ఏంటని ఉద్యమకారుడు కోల్లా జనార్దన్ ప్రశ్నించారు.
అడుగడుగునా అన్యాయం..
సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని ఉద్యమకారుడు ప్రపూల్ రామ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఉద్యమకారులు మురళీధర్ దేశ్ పాండే మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తూ ఉద్యమకారులను, అమరులను , వారి త్యాగాలను విస్మరించారని మండిపడ్డారు.
మరో నాయకుడు నందగోపాల్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ త్యాగాలను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న కేసీఆర్ ఆలోచనలు దుర్మార్గమైనవన్నారు. సమావేశంలో విద్యార్థి సంఘం నాయకుడు వేముల రామకృష్ణ, అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్, నీల వెంకటేష్, శివశంకర్, రాందేవ్ మోడీ తదితరులు పాల్గొన్నారు.