
హైదరాబాద్, వెలుగు: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్రెడ్డి, ఆమె అనుచరులు సోమవారం కాంగ్రెస్లో చేరారు. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ స్టేట్ ఇన్చార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తాను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్రెడ్డి సహకరించారని, తన రాజకీయ ఎదుగుదలలో ప్రతిసారీ అండగా నిలబడ్డారని తెలిపారు.
2009లో టీడీపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని, కేసీఆర్ మహబూబ్నగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. దయాకర్రెడ్డి ముందుండి గెలిపించారని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్ను గెలిపించిన పాలమూరుకు ఆయన చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 31 పంపుల్లో, ఒక్కదాన్నే పూర్తి చేశారని విమర్శించారు. ఒక్క పంపుతోనే ప్రాజెక్టు పూర్తయినట్టుగా హడావుడి చేసి, కేసీఆర్ దాన్ని ప్రారంభించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో పాలమూరులో వలసలు ఆగలేదని, అభివృద్ధీ జరగలేదని రేవంత్ విమర్శించారు.
ఆమెకు అండగా ఉంటం
సీతా దయాకర్రెడ్డి జడ్పీ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని రేవంత్ కొనియాడారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్లు దోపిడీ దొంగలకంటే దారుణంగా తయారయ్యారని ఫైర్అయ్యారు. కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యేకు పట్టట్లేదని మండిపడ్డారు. నారాయణపేట–- కొడంగల్ ఎత్తిపోతలను పడావుపెట్టారని ఆరోపించారు. పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించాలని రేవంత్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సీతా దయాకర్ రెడ్డిని రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 17న తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే విజయ భేరి సభకు భారీగా తరలి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
17న తుక్కుగూడ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు
రాజీవ్గాంధీ ప్రాంగణంలో రేవంత్ భూమిపూజఈ నెల 17న తుక్కుగూడ భారీ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సభ స్థలానికి రాజీవ్గాంధీ ప్రాంగణం అని పేరు పెట్టిన నేతలు, సోమవారం అక్కడ భూమిపూజ చేశారు. ఏఐసీసీ ఇన్ చార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
సభకు కాంగ్రెస్ జాతీయ నాయకులంతా వస్తున్నారని, పార్టీ శ్రేణులంతా సభకు వచ్చి విజయవంతం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. మరోవైపు, సభ కోసం పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ రాచకొండ కమిషనర్కు మల్లు రవి, సంకేపల్లి, సుధీర్ రెడ్డి, బండి సుధాకర్ తదితరులు వినతిపత్రం అందజేశారు.