కేసీఆర్ కోసం టీఆర్ఎస్... దేశం కోసం బీజేపీ

కేసీఆర్ కోసం టీఆర్ఎస్... దేశం కోసం బీజేపీ

రంగారెడ్డి జిల్లా: రాష్ట్రానికి అసలైన ద్రోహి కేసీఆరే అని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తప్ప... ప్రజల కోసం పనిచేయదని ఆరోపించారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రం నుంచి ప్రారంభమైన  ప్రజా గోస – బీజేపీ భరోసా బైక్ యాత్రలో విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో కలిసి బైక్ ను నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాల గురించి చెప్పడానికే బీజేపీ  ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్... రాష్ట్రం వచ్చాక తన కుటుంబ సభ్యులకు మాత్రమే పెద్ద ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఫైర్ అయ్యారు.

దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారని, మూడెకరాల ఊసే లేదని విమర్శించారు. స్వరాష్ట్రంలోనైనా ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే... కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ బాగుపడలేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అన్న ఆయన... దేశం కోసం పుట్టిన పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించి బీజేపీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.