
నస్పూర్, వెలుగు: సింగరేణిలో ఉన్న ప్రతి అధికారికి నాయకత్వ లక్షణాలు ఉండాలని నైవేలి లిగ్నెట్ మాజీ డైరెక్టర్ కె.మోహన్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్లో హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కొత్తగూడెం ఆధ్వర్యంలో నాయకత్వ లక్షణాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల జీఎంలు శ్రీనివాస్, దేవేందర్, విజయ భాస్కర్ రెడ్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ జీఎం టి.వెంకట్రామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అధికారి నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని వారి విధులను సమర్థంగా నిర్వర్తించాలన్నారు. సంస్థ అభివృద్ధికి అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. ప్రణాళిక వేసుకొని ముందుకు సాగాలన్నారు. శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల ఎస్వోటు జీఎంలు ఎన్.సత్యనారాయణ, రాజమల్లు, ఆయా ఏరియాల ప్రాజెక్టు ఆఫీసర్లు, ఏజెంట్లు, అన్ని గనుల విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.