రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. ఒక్కరోజు పర్యటన కోసం హైదరాబాద్ కు వచ్చిన ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కానీ మోడీని ఎంత విమర్శిస్తే ఆయన అంతే వేగంగా ముందుకు వెళ్తారని స్పష్టం చేశారు. అయినా మోడీని తిట్టిన వాళ్ల పరిస్థితి ఎలా ఉందో టీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఊరికే మోడీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వీఐపీ సంస్కృతి కరెక్ట్ కాదని భావించిన పీఎం మోడీ... వీఐపీ వాహనాలపై సైరన్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సామాన్య ప్రజలంటే మోడీకి ఎంత ప్రేమో దీంతో అర్థమవుతుందని చెప్పారు.

మూడు సార్లు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఘనత భారత్ కు దక్కిందన్న జవదేకర్.. దీనంతటికీ మోడీయే కారణమని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక టెర్రరిస్ట్ అటాక్ లు తగ్గాయని, మోడీని చూసి టెర్రరిస్టులు వణుకుతున్నారని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ తో దేశ గౌరవాన్ని మోడీ మరింత ఇనుమడింపజేశారని కొనియాడారు.