శ్రీనగర్: ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్ కేసులో మరో నలుగురు ప్రధాన నిందితులను గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఓ ప్రకటన జారీ చేసింది. శ్రీనగర్లో వీరిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. నిందితులను పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, అనంతనాగ్ కు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్, లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్, షోపియాన్ కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేగా గుర్తించినట్టు ఎన్ఐఏ తెలిపింది.
పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో నలుగురు నిందితులను 10 రోజుల కస్టడీకి తీసుకున్నామని చెప్పింది. ఢిల్లీ ఎర్రకోట ఉగ్రదాడిలో వీరంతా కీలక పాత్ర పోషించారని పేర్కొంది. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు అంతకుముందే ఇద్దరు నిందితులు అమీర్ రషీద్ అలీ, జాసిర్ బిలాల్ వనీని అరెస్టు చేశారు.
