
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లు దూసుకెళ్లడంతో దేశీయ మార్కెట్లు కూడా పరుగులు పెట్టాయి. ఆర్బీఐ రేటు తగ్గింపు ఎఫెక్ట్ కూడా కలసి రావడంతో సోమవారం (June 9) స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో ముగిశాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 256.22 పాయింట్లు పెరిగి 82,445.21 వద్ద స్థిరపడింది. ఇందులోని 21 షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో 480.01 పాయింట్లు పెరిగి 82,669కి చేరుకుంది.
50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 100.15 పాయింట్లు పెరిగి 25,103.20కి చేరుకుంది. సోమవారం వరకు జరిగిన నాలుగు రోజుల ర్యాలీలో, నిఫ్టీ 560 పాయింట్లు (2.27 శాతం) లాభపడగా, సెన్సెక్స్ 1,707 పాయింట్లు (2.1 శాతం) పెరిగింది. అమెరికా, చైనా మధ్య తాజా రౌండ్ వాణిజ్య చర్చలపై ఆశావాదం కూడా మార్కెట్లను పైకి నడిపించింది. సెన్సెక్స్ స్టాక్లలో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ అత్యధికంగా లాభపడ్డాయి.
ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ భారతీ ఎయిర్టెల్ వెనకబడి ఉన్నాయి. బీఎస్ఈ స్మాల్-క్యాప్ గేజ్ 1.19 శాతం, మిడ్క్యాప్ 1.03 శాతం పెరిగింది. బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లలో రియాల్టీ మాత్రమే వెనకబడింది. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్, షాంఘైకి చెందిన ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ లాభపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు బాగా పెరిగాయి. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.1,009.71 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.