
- ఓ వ్యక్తి నుంచి రూ.7 లక్షలు కొట్టేసిన ఇద్దరు సైబర్ దొంగల అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు : గూగుల్ మ్యాపింగ్లో రేటింగ్ పేరుతో ఆన్లైన్ టాస్క్లను క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్లతో కలిసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేటకు చెందిన గుడ్డింగారి వెంకటేశ్(23), మల్కాజిగిరిలోని ఓల్డ్ సఫిల్గూడకు చెందిన ములుగూరి విజయ్(36) ఈజీ మనీ కోసం సైబర్ నేరగాళ్లతో జత కట్టారు. గూగుల్ మ్యాపింగ్స్కు రేటింగ్ పేరుతో ఆన్ లైన్ టాస్క్లు నిర్వహించేవారు.
ఈ టాస్క్లను ఆడిన వారికి కమీషన్లు వస్తాయని చెప్పి మొదట కొంత లాభాలను చూపించేవారు. ఆ తర్వాత టాస్క్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మరింత మొత్తంలో గెలుచుకోవచ్చని నమ్మించేవారు. వీరి మాటలు నమ్మిన వారు డబ్బు ఇన్వెస్ట్ చేయగానే వెంటనే సెల్ ఫోన్ స్విచాఫ్ చేసేవారు. వెంకటేశ్, విజయ్ఇటీవల బోయిన్ పల్లికి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ కాల్ చేశారు. గూగుల్ మ్యాపింగ్ చేసి రేటింగ్ ఇస్తే లాభాలు ఇస్తామన్నాడు. వారి మాటలు నమ్మిన సదరు వ్యక్తి టాస్క్ను పూర్తి చేశాడు.
దీంతో టాస్క్ గెలిచావంటూ ఆ వ్యక్తికి విజయ్, వెంకటేశ్ కొంత డబ్బు పంపారు. మళ్లీ టాస్క్ ఇచ్చి పూర్తి చేయాలన్నారు. కొంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. ఇలా బాధితుడి నుంచి ఇన్వెస్ట్ చేయించి రూ.7 లక్షల 15 వేలు కొట్టేశారు. ఆ తర్వాత విజయ్, వెంకటేశ్ స్పందించకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్, విజయ్ను అరెస్ట్ చేశారు.
వారి నుంచి 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ గూగుల్ మ్యాపింగ్ టాస్క్ పేరుతో బ్యాంక్ అకౌంట్లను సేకరించి సైబర్ నేరగాళ్లకు చేరవేస్తున్నారని.. రూ.3 కోట్ల వరకు కొట్టేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి నేరాలపై దేశవ్యాప్తంగా 104 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 13 ఉన్నాయన్నారు.