
సమ్మె ఉందని చేయబోమంటున్న కౌంటర్ సిబ్బంది
ఈ మేరకు పైనుంచి ఆదేశాలున్నట్టు వెల్లడి
ఇబ్బంది పడుతున్న దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్లు
ప్రతి నెలా 45 వేలకుపైనే పాసుల రెన్యూవల్ కావాలె
రాష్ట్రంలో దివ్యాంగులు, స్వాతంత్ర్య సమరయోధులు వంటివారికి ఇచ్చే ఉచిత బస్పాసులు రెన్యూవల్ కావడం లేదు. డబ్బులు చెల్లించే స్టూడెంట్ పాస్లు, రూట్పాసులు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఆర్టీసీ సమ్మె నడుస్తోందని, ఫ్రీ బస్పాసులు ఇవ్వొద్దంటూ పైనుంచి ఆదేశాలు ఉన్నాయని కౌంటర్లలోని సిబ్బంది చెప్తున్నారు. పాస్ల గడువు ముగియడంతో తాము తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని దివ్యాంగులు, వృద్ధులు, స్వాతంత్ర్య సమరయోధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నెలకు 45 వేలకు పైనే రెన్యూవల్..
రాష్ట్రంలో 5.6 లక్షల దివ్యాంగ బస్పాసులు, ఐదు వేల వరకు స్వాతంత్ర్య సమరయోధుల బస్పాసులు ఉన్నాయి. వాటిని ఏటా రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగ బస్ పాసులు ప్రతినెలా సుమారు 45 వేల వరకు రెన్యువల్ అవుతుంటాయి. వారికి హైదరాబాద్ సిటీ బస్సుల్లో పూర్తి ఉచితంగా, జిల్లాల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. ఇందులో వైకల్య శాతం ఎక్కువగా ఉన్నవారికి రాష్ట్రమంతటా ఉచితంగా ఉండటంతోపాటు తోడుగా వచ్చిన ఒకరికి కూడా టికెట్ చార్జీలో 50% రాయితీ ఇస్తారు. ఇక స్వాతంత్ర్య సమరయోధులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది. బస్పాసులు రెన్యూవల్ చేయకపోవడంతో వారు ఇబ్బందిపడుతున్నారు.
మాకేం సంబంధం?
అక్టోబర్31 వరకు వేలల్లో బస్పాసుల గడువు ముగిసింది. దీంతో రెన్యూవల్ కోసం కౌంటర్ల దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండటం లేదు. ‘‘కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఫ్రీ బస్పాసులు చేయొద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి. వాళ్లు చెప్పినట్లు చేస్తున్నం. మాకేం సంబంధం లేదు. బస్సుల్లో పాసులే చెల్లడం లేదు. రెన్యూవల్ చేసుకుని ఏం చేస్తరు’’ అని సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి బస్పాసుల జారీకి, ఆర్టీసీ కార్మికులకు సంబంధమేమీ లేదు. ఆర్టీసీ బస్పాసుల ప్రక్రియను ఔట్సోర్సింగ్కు అప్పజెప్పింది. కొత్త పాసులు ఇవ్వాలన్నా, రెన్యూవల్ చేయాలన్నా ఔట్సోర్సింగ్ సిబ్బందే చూసుకుంటారు.
ఎక్కడికని పోవాలె?
ఫ్రీ బస్పాసుల రెన్యూవల్ అంశంపై ఆర్టీసీ అధికారులను అడిగితే.. హైదరాబాద్లోని కొన్నిచోట్ల చేస్తున్నామని, అక్కడికి వెళ్లి చేసుకోవాలని చెప్తున్నరు. జిల్లాల్లో మాత్రం పూర్తిగా బంద్ అయినట్టు పేర్కొంటున్నారు. దీనిపై దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడ రెన్యూవల్ చేస్తున్నారో తమకెట్లా తెలుస్తుందని, తామెలా వెళ్లగలమని వాపోతున్నారు. వెంటనే బస్పాస్లను రెన్యూవల్ చేయాలని
కోరుతున్నారు.