
- దళిత ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతల కంప్లైంట్
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పిటిషన్
హనుమకొండ, వెలుగు : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై హనుమకొండ సుబేదారి పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. గ్రానైట్ క్వారీ ఓనర్ను బెదిరించిన కేసులో శనివారం రాత్రి ఆయనకు బెయిల్ మంజూరు కాగా.. కోర్టు నుంచి బయటకు వచ్చిన కౌశిక్రెడ్డి సీఎంతో పాటు మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, కడియం శ్రీహరి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దళిత ఎమ్మెల్యేలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కౌశిక్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ఆదివారం సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కౌశిక్రెడ్డి మాట్లాడిన వీడియో పరిశీలించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నేత రామంచ ఐలయ్య మాట్లాడుతూ సీఎంతో పాటు మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, కడియం శ్రీహరి బెదిరించి, వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కౌశిక్రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారన్న వివక్షతతోనే ఆరోపణలు చేసి వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారన్నారు. దళిత ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్పై విచారణ జరిపి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.