యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు

యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బతికుండగానే ఓ యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగింది.

షాద్ నగర్ పట్టణంలోని కీర్తి వెంచర్లో నిన్న(మంగళవారం) శ్రీనగర్ కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు నవీన్, రాధాకృష్ణ, శ్రీను, ప్రదీప్ లు కలిసి ఫుల్ గా మందు కొట్టారు. తర్వాత వీరికి మధ్య ఏ గొడవ జరిగిందో తెలియదు కానీ నవీన్ అనే యువకుడి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు మిగతా ముగ్గురు. ఈ దారుణమైన ఘటన బుధవారం బయటపడింది. తీవ్రంగా గాయపడిన నవీన్ ను స్థానిక ఆస్పత్రి సంజీవినికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న షాద్ నగర్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గొడవకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.