మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూర్
రాష్ట్రానికి కొత్తగా ప్రకటించిన మూడు హైస్పీడ్ ట్రైన్స్ తో హైదరాబాద్ త్వరలోనే హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ మేజర్ హబ్ గా మారబోతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. రవాణా సహా అనేక కీలక అంశాల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. హెల్త్ కేర్, ట్రాన్స్ పోర్ట్, ఎడ్యుకేషన్కు ఊతం ఇవ్వనున్నట్టు చెప్పారు. అలాగే, దక్షిణాది రాష్ట్రాలకు డైమండ్ ప్రాజెక్ట్గా అభివర్ణించారు. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించి.. అలైన్మెంట్స్ ఖరారు చేయనున్నట్టు వెల్లడించారు.
3 గంటల్లోనే ముంబై, చెన్నై, బెంగళూరు
బుల్లెట్ ట్రైన్స్ తో హైదరాబాద్ నుంచి కీలక మెట్రో పాలిటన్ సిటీలైన ముంబై, బెంగళూరు, చెన్నై, పుణేకు కేవలం 3 గంటల్లోపే చేరుకో వచ్చని రైల్వే మంత్రి తెలిపారు. అలాగే, హైదరాబాద్– పుణే కేవలం 1:55 గంటల్లో, పుణే–ముంబై 48 నిమిషాల్లో చేరుకోవచ్చని వివరించారు. అంటే హైదరాబాద్ – ముంబై కేవలం 2:30 గంటల్లో ఈ హై స్పీడ్ ట్రైన్స్ తో రీచ్ కావొచ్చన్నారు. అలాగే, హైదరాబాద్ – చెన్నైకి 3 గంటల లోపు, హైదరాబాద్ – బెంగళూరు 2 గంటల్లో చేరుకోవచ్చిన వివరించారు. ఈ విధంగా మూడు ముఖ్యమైన మెట్రో పాలిటన్ సిటీల మధ్య గేమ్ చేంజర్ గా హైదరాబాద్ మారనుందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి దశలో ముంబై–అహ్మదాబాద్ కు హై స్పీడ్ ట్రైన్ ప్రకటించామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా టెక్నికల్, డిజైన్, ఎలక్ట్రికల్ టీం.. అన్ని అంశాలను పరిశీలించిందన్నారు. ఇది సక్సెస్ కావడంతో సెకండ్ ఫేజ్ లో దేశంలోని ఏడు ముఖ్య నగరాలను కలిపేలా ఏడు బుల్లెట్ ట్రైన్లు తీసుకువచ్చిందన్నారు. ఇందులో నార్త్ కు రెండు, సౌత్ – వెస్ట్ రాష్ట్రాలకు మిగిలిన5 ట్రైన్లు ప్రకటించామన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దేశ వ్యాప్తంగా మరిన్ని హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లు తీసుకువస్తామన్నారు.
తెలంగాణకు రైలు అనుసంధానాన్ని సైతం రైల్వే శాఖ మెరుగుపరుస్తోందని, కొత్త టెక్నాలజీ, అధునాతనతో కూడిన కొత్త రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ తెలిపారు. ఇప్పటివరకు 5 వందే భారత్ రైళ్లు, 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ నడుస్తున్నాయని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు 1,115 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందని చెప్పారు.
ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా ఏపీలోని నంబూరుకు 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం 2024 అక్టోబర్ 24న ఆమోదం తెలిపిందని, భద్రాచలం మీదుగా మల్కన్గిరి, పాండురంగాపురం మధ్య 173.6 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కూడా కేంద్రం ఓకే చెప్పిందని వెల్లడించారు.
