
ముషీరాబాద్, వెలుగు: ప్రజల సమస్యలపై పాట లతో సమాజాన్ని చైతన్యపరిచిన గద్దర్ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన పాట, మాట ఆగలేదని గద్దర్ కూతురు వెన్నెల అన్నారు. గద్దర్ ఆశయాలను కొనసాగిస్తూనే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన అభిమానులపై ఉందన్నారు. పాటల రూపంలో గద్దర్ ఇచ్చిన జ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు, హక్కుల రక్షణ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి సొసైటీ అధ్యక్షుడు రాజు ఉస్తాద్, చెరుకు రామచందర్ తో కలిసి వెన్నెల పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి గద్దర్ పాట మూల స్తంభంగా నిలిచిందన్నారు.