
- అగ్రిమెంట్ చేసుకున్నాక కొనబోమంటూ మొండికేస్తున్న కంపెనీలు
- దిగుబడి ఎక్కువగా వచ్చిందని సాకులు
- బహిరంగ మార్కెట్లో అమ్మకోలేక రైతుల తిప్పలు
గద్వాల/అలంపూర్, వెలుగు: పొగాకు కంపెనీలు రైతులను నిండా ముంచాయి. పొగాకు సాగు చేయండి.. తామే పొగాకు కొంటామన్న కంపెనీలు ఇప్పుడు సరుకు కొనకపోవడంతో రైతులు నిండా మునిగారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూరు, గద్వాల నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల వరకు పొగాకు సాగు చేశారు. అలంపూర్ నియోజకవర్గంలో ఉండవెల్లి, అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో పెద్ద ఎత్తున పొగాకు సాగు చేశారు. పొగాకు కొనుగోలుకు సంబంధించి ఐటీసీ, జీపీఐ, వీఎస్టీ, అలయన్స్ కంపెనీల వారు పొగాకు కొనుగోలు చేస్తామని రైతులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత కంపెనీ వాళ్లు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లో పొగాకును కంపెనీ వాళ్లు కొనుగోలు చేయకపోవడంతో పొలాల్లోనే నిలువ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అగ్రిమెంట్ ప్రకారం కొనలే..
వాస్తవంగా పొగాకు పంట సాగు చేయడం ప్రభుత్వం దృష్టిలో ఇల్లీగల్. కంపెనీలు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని కొన్నిచోట్ల సాగు చేయిస్తారు. గద్వాల జిల్లాలో ఐటీసీ, జీపీఐ. వీఎస్టీ, అలయన్స్ కంపెనీలతో పాటు డెక్కన్, బొమ్మిడాల కంపెనీలు జిల్లాలో 50 వేల ఎకరాల్లో పొగాకు పంటను రైతులతో సాగు చేయించారు. రైతులతో క్వింటాల్ పొగాకుకు రూ.15,500 ఇస్తామని కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. కానీ, కొంత మంది రైతుల నుంచి పంటను రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. చాలా మంది రైతుల నుంచి పంట కొనుగోలు చేయకపోవడంతో, రైతులు తమ పొలాల్లోనే పొగాకును నిల్వ చేసుకున్నారు.
దిగుబడి పెరిగిందని కొంటలేరు..
పొగాకు ఉత్పత్తుల్లో 62 రకాలు ఉన్నాయి. గద్వాల జిల్లాలో బీడీ, సిగరెట్, సుక్కబార్లీ రకాలు ఎక్కువగా సాగు చేస్తారు. అగ్రిమెంట్ ప్రకారం ఎంత దిగుబడి వచ్చినా కొనుగోలు చేయాల్సి ఉంది. సుక్క బార్లీ రకం ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సిగరెట్, బీడీ రకాలు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈసారి పొగాకు దిగుబడి ఎక్కువగా వచ్చిందని చెబుతూ, రైతులు పండించిన పొగాకును కొనుగోలు చేయకుండా కంపెనీలు ముఖం చాటేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
ఎకరా పొగాకు సాగు చేయాలంటే రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. పొగాకును బయట మార్కెట్ లో అమ్ముకునేందుకు వీలు లేకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా రైతులతో పాటు కర్నాటక రైతులకు కూడా ఇక్కడి కంపెనీలు పొగాకు సాగు చేసేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. డబ్బులు ఇచ్చే సమయంలో తమను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారని పలువురు కర్నాటక రైతులు వాపోతున్నారు.
కంపెనీల ముందు ధర్నా చేస్తాం..
అగ్రిమెంట్ ప్రకారం పొగాకు కొనకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. పొగాకు పంటను తీసుకెళ్లి కంపెనీ ముందు పెట్టి ధర్నా చేస్తాం. రైతులంటే అందరికీ అలుసుగా మారింది.
వెంకటేశ్, అలంపూర్
అగ్రిమెంట్ ప్రకారం కొనుగోలు చేయాల్సిందే..
కంపెనీలు రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం పొగాకును కొనుగోలు చేయాలి. అగ్రిమెంట్ ఉండడంతోనే రైతులు పొగాకు సాగు చేశారు. రైతులకు నష్టం కలిగించిన పొగాకు కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
సక్రియానాయక్, డీఏవో