
జోగులాంబ గద్వాల: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరుమలరావును గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గద్వాల పట్టణానికి చెందిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఐశ్వర్య ప్రియుడు తిరుమలరావు తన భార్యను, ప్రియురాలి భర్త తేజేశ్వర్ను గుట్టుచప్పుడు కాకుండా హత్య చేసి.. ఆత్మహత్యలుగా చిత్రీకరించి లడఖ్ వెళ్లేందుకు టికెట్లు సిద్ధం చేసుకున్నారు.
ప్రియురాలు తన భర్తను అడ్డు తొలగించుకోగా, హత్య వ్యవహారం బయటకు రావడంతో కథ అడ్డం తిరిగింది. ఇద్దరిని హత్య చేశాక లడఖ్ వెళ్లేందుకు తిరుమల రావు బ్యాంక్ నుంచి రూ.25 లక్షల లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో రూ.2 లక్షలు సుపారి గ్యాంగ్కు చెల్లించినట్లు ఇన్వెస్టిగేషన్లో తెలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఒక బ్యాంకులో స్వీపర్గా పని చేస్తుండగా బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కూతురు ఐశ్వర్యతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడం, ఆమెను పెళ్లి చేసుకుని పిల్లలను కనాలనుకోవడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్.
తిరుమల రావుకు పెళ్లయి 8 ఏళ్లయినా పిల్లలు లేరు. అందుకే.. భార్యను చంపేసి ప్రియురాలితో కాపురం చేసి పిల్లలను కనాలని తిరుమల రావు భావించాడు. అయితే.. ఈ ఆలోచన కలిగే సమయానికి ఐశ్వర్యకు తేజేశ్వర్ అనే యువకుడితో పెళ్లయింది. వాస్తవానికి తేజేశ్వర్ను పెళ్లి చేసుకోకుండా తిరుమలరావు, ఐశ్వర్య వెళ్లిపోయే అవకాశం ఉన్నా తేజేశ్వర్ను పెళ్లి చేసుకుని మరీ చంపాల్సినంత అవసరం ఏమొచ్చిందనే విషయం ఇప్పుడు తేలాల్సి ఉంది.
ఈ క్రమంలో మే 17న ఐశ్వర్య భర్త తేజేశ్వర్ను పక్కా ప్లాన్తో చంపేశారు. ఆ తర్వాత మేనేజర్ తన భార్యను కూడా చంపి ఇద్దరు కలిసి లడఖ్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే మేనేజర్ భార్య హత్య నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు ఇంకా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. పోలీసుల అదుపులో ఐశ్వర్య తల్లి సుజాత, ఐశ్వర్యతో పాటు సుపారి గ్యాంగ్, బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు, కారు డ్రైవర్ ఉన్నారు.