- కలెక్టర్ కే.హైమావతి
గజ్వేల్, వెలుగు: గజ్వేల్ పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం, పాలకూర పప్పు, వంకాయ-ఆలుగడ్డ-టమాటా కూరలను పరిశీలించిన కలెక్టర్, భోజనం నెయ్యితో వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలిస్తూ, సరుకులు అందిన వెంటనే నమోదు చేయాలని, ఒకేసారి రాస్తానంటూ నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు.
కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థుల హాజరు ప్రకారం అందరికీ సరిపడేలా ఆహారం రుచికరంగా వండాలని సూచించారు. రోజువారీ చదువుతో పాటు ఆటలు కూడా ఆడాలని విద్యార్థులకు తెలిపారు. పిల్లల భోజనం, వసతి, చదువు విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, మంచి క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించాలని ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.
