కరీంనగర్ : ఆదాయానికిమించి ఆస్తుల కేసులో గజ్వేల్ ఎమ్మార్వో కామటం శ్రవణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు ఏసీబీ అదికారులు. కరీంనగర్ లోని ఆయన నివాసంతోపాటు రెండు ప్రదేశాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు అక్రమాస్తులకు సంబంధించిన రూ.4కోట్ల విలువైన కీలక పత్రాలు, ఆభరణాలు,నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే..
శనివారం(మార్చి 7) అక్రమాస్తుల కేసులో శ్రవణ్ కుమార్ కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు.సోదాల్లో భాగంగా రెండు ఇళ్లు, ఆరు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్, నాలుగు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తుల రూపంలో సుమారు రూ.2.47 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
వీటిలోపాటు బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు మరియు రూ.11.90 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల విలువ సుమారు రూ.4 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
అధికార దుర్వినియోగం చేసి అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
