
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో పేషంట్లు, డ్యూటీ డాక్టర్లకు డైట్ క్యాంటీన్ ద్వారా క్వాలిటీ ఫుడ్అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ రాజకుమారి తెలిపారు. ఎర్రగడ్డ మెంటల్హాస్పిటల్లో కలుషిత ఆహారం తిని ఒకరు మృతి చెంది, పలువురు రోగులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో గాంధీ అధికారులు అప్రమత్తమై, సిబ్బందితో బుధవారం సమావేశమయ్యారు. ఆహార సరఫరా, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో గాంధీ ప్రధాన భవనం సెల్లార్లో డైట్ కిచెన్ ఉండగా, మురుగు, బొద్ధింకలు, పందికొక్కులతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ క్రమంలో గాంధీ అత్యవసర విభాగం వెనుక రూ. 1.50 కోట్లతో నిర్మించిన కొత్త డైట్ భవనం నిర్మాణంతో దశాబ్దాల సమస్యను పరిష్కారం లభించిందని అధికారులు తెలిపారు. డైట్ కాంట్రాక్ట్ సంస్థ శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ లక్షల రూపాయలతో రైస్ కుక్కర్స్, రోటీ మేకర్, హైజెనిక్ బాయిలర్లు, కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేసింది. నిరుపేద రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని డైట్ నిర్వహణ సంస్థ ప్రతినిధి రవికుమార్ తెలిపారు.