- 51 డీఆర్ఎఫ్ టీమ్స్, 394 మంది గజ ఈతగాళ్లు
- 21 బైక్ బృందాలు రెడీ
- నిమజ్జన ఏర్పాట్లపై హైడ్రా కమిషనర్ సమీక్ష
హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్నిమజ్జనం ఈ నెల 25, 26 తేదీల్లో ఉండడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం సమీక్ష నిర్వహించారు. విగ్రహాలు మండపాలకు, నిమజ్జనానికి చేరుకునే దారుల్లో ఇబ్బందుల్లేకుండా చెట్ల కొమ్మల తొలగింపు పనులు మొదలుపెట్టినట్టు చెప్పారు.
జీహెచ్ఎంసీ, సీఎంసీ పరిధిలో 47 చొప్పున 94 చెరువుల్లో నిమజ్జనం జరగనుండగా, ఎంఎంసీలో మరో 9 చెరువులను నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 3 కార్పొరేషన్ల పరిధిలో 103 చెరువుల్లో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో 51 డీఆర్ఎఫ్ బృందాలతోపాటు 394 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. వీరితోపాటు 21 బైక్ బృందాలు ఉంటాయని పేర్కొన్నారు.
హుస్సేన్సాగర్పై ప్రత్యేక దృష్టి : వర్ల పాపయ్య
హుస్సేన్సాగర్ వద్ద నిమజ్జనం కోసం హైడ్రా తరఫున చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య తెలిపారు. హుస్సేన్సాగర్లో ప్రతి షిఫ్టులో 50 మంది గజ ఈతగాళ్లు విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక శాఖకు చెందిన బోట్లతోపాటు హైడ్రాకు చెందిన 6 బోట్లను కూడా నిమజ్జన సమయంలో వినియోగించనున్నట్లు చెప్పారు. దుర్గం చెరువు, ఐడీఎల్ చెరువు, మల్కం చెరువు, గంగారం చెరువు, లింగం చెరువు, దుండిగల్ పెద్దచెరువుతోపాటు అవసరమైన ఇతర నిమజ్జన కేంద్రాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
కాప్రా చెరువు మినహా..
కాప్రా చెరువు మినహా సిటీలోని మిగతా అన్ని చెరువుల్లో గణేశ్నిమజ్జనాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని హైడ్రా స్పష్టం చేసింది. కాప్రా చెరువు నేషనల్ వెట్ ల్యాండ్స్ లిస్ట్లో ఉన్నందున.. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆంక్షలున్నట్టు తెలిపింది. అయితే ఇక్కడ బేబీ పాండ్లో ఐదడుగుల విగ్రహాల వరకూ నిమజ్జనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియా, యూరప్తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 470కు పైగా వలస పక్షులకు ఆవాసంగా చెరువు ఉందన్నారు.
