- జెట్టీ కట్టి 18 కిలోమీటర్లు తీసుకొచ్చిన సహచరులు
వెంకటాపురం, వెలుగు : తెలంగాణ – చత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలడంతో ఓ గిరిజనుడు చనిపోయాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు పంచాయతీ పరిధిలోని ఎదుళ్ల చెరువు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు (60), బొగ్గుల ముట్టయ్య, కుర్సం పాపారావు, మడకం బాబు, బొగ్గుల లక్ష్మయ్య, బొగ్గుల వీరయ్యతో కలిసి మంగళవారం కర్రెగుట్టలకు వెళ్లాడు. జల్ల గ్రామ సమీపంలో తాత్కాలిక గుడారం ఏర్పాటు చేసుకుని బెడం గుట్టల ప్రాంతంలోని వెదురు సేకరిస్తున్నారు.
బుధవారం సాయంత్రం బొంగులు నరికి తిరిగి వస్తున్న సమయంలో నాగేశ్వరరావు ల్యాండ్ మైన్ పై కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి నాగేశ్వరరావు సుమారు 15 అడుగుల ఎత్తుకు ఎగిరి పది మీటర్ల దూరంలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని సహచరులు జెట్టి కట్టి జల్ల, పామునూరు అడవి మార్గం, పాలెం ప్రాజెక్టు మీదుగా సుమారు 18 కిలోమీటర్లు మోసుకుంటూ గ్రామానికి తీసుకొచ్చారు.
తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గమధ్యలోనే నాగేశ్వరరావు చనిపోయాడు. కేసు నమోదు చేసినట్లు వెంకటాపురం సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతి తెలిపారు. విషయం తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థికసాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నారాయణ్పూర్అడవుల్లో మావోయిస్ట్ డంప్ స్వాధీనం
భద్రాచలం, వెలుగు : చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్జిల్లా హాచ్చాకోట పోలీస్స్టేషన్ పరిధిని అడవుల్లో మావోయిస్టుల డంప్ దొరికింది. ఎస్పీ సందీప్పటేల్తెలిపిన వివరాల ప్రకారం... గురువారం భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో హాచ్చాకోట అడవుల్లో డంప్ కనిపించింది. బీడీఎస్టీం సాయంతో దాన్ని ఓపెన్చేసి చూడగా.. 315 రైఫిల్, వివిధ తుపాకులకు సంబంధించిన 41 తూటాలు, ఆరు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, రెండు బండిళ్ల వైరు, విప్లవ సాహిత్యం,ఫ్లెక్సిబుల్ వైర్, ఎల్ఈడీ లైట్లు, నిత్యావసర వస్తువులు కనిపించాయి.
