ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా పుణెకు గంజాయి

ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా పుణెకు గంజాయి
  •     సిటీ  మీదుగా తరలిస్తున్న ఆరుగురి అరెస్ట్
  •     227 కిలోల సరుకు స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు : ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా పుణెకు గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని మేడ్చల్ ఎస్​వోటీ, శామీర్​పేట పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ పీఎస్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ శబరీష్ వివరాలు వెల్లడించారు. పుణేకు చెందిన యోగేశ్ రాజాసింగ్ జాదవ్(29) మెకానిక్​గా పనిచేస్తున్నాడు. యోగిరాజ్ సంజయ్ హోట్కర్(23), దివాకర్ నారాలే(26) వ్యవసాయం చేసేవారు. చరణ్​లాలా షిండే(31) సెంట్రింగ్ వర్కర్ కాగా.. చైతన్య తుషార్(19), రాహుల్ కాంతిలాల్ పటోలే(19) ఇద్దరూ స్టూడెంట్లు. 

వీరంతా గ్యాంగ్​గా ఏర్పడి ఈజీ మనీ కోసం ఒడిశా నుంచి గంజాయిని సేకరించి మహారాష్ట్రంలోని పుణెతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో అమ్మేవారు. ఈ గ్యాంగ్ ఇటీవల  ఒడిశాకు చెందిన సంజు వద్ద 272 కిలోల గంజాయిని సేకరించింది. దాన్ని పుణెలో ఉండే అప్పా సోలంకి అందించేందుకు సిద్ధమైంది. రెండు వెహికల్స్​లో గంజాయి ప్యాకెట్లతో పుణేకు బయలుదేరింది. సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్​వోటీ, శామీర్​పేట పోలీసులు ఓఆర్ఆర్ వద్ద తనిఖీలు చేపట్టారు. 

వీరి కార్లను గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 272 కిలోల గంజాయితో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించారు. సప్లయర్ సంజు, కొనుగోలు దారుడు అప్పా సోలంకి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.

శంకర్​పల్లిలో 18 కిలోలు సీజ్

శంకర్​పల్లి :  ఇబ్రహీంబాగ్​కు చెందిన రాజు సింగ్(37) గురువారం అర్ధరాత్రి సిటీ నుంచి రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లికి ఆటోలో గంజాయిని తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మోకిల వద్ద అతడి ఆటోను అడ్డుకున్నారు. రూ.4 లక్షల విలువైన 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి స్టేషన్​కు తరలించారు. రాజు సింగ్ ను రిమాండ్​కు పంపినట్లు పోలీసులు తెలిపారు.