
ఎల్కతుర్తి, వెలుగు: గేట్వే ఆఫ్ వరంగల్గా ఉన్న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వరంగల్ -కరీంనగర్ హైవే ఎన్హెచ్ (563), సిద్దిపేట - ఎల్కతుర్తి హైవే (765 డీజీ) లను కలిపే జంక్షన్ నిర్మాణం పూర్తయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో 9 నెలల్లోనే జంక్షన్ సుందరీకరణ పనులు పూర్తి చేయించారు. డ్రైన్లు, పాత్ వేలు ఏర్పాటు చేసే పనులు చివరి దశకు చేరుకున్నాయి. గతేడాది సెప్టెంబర్ 23న ఆర్టీసీ బస్టాండ్, జంక్షన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి, అభివృద్ధికి ప్లాన్ రెడీ చేయాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు.
జంక్షన్ అభివృద్ధికి రూ.1.53 కోట్లు కేటాయిస్తునట్లు కుడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. ఆ మరుసటి రోజే సెక్రటేరియేట్ లో కుడా చైర్మన్ నుంచి పరిపాలనా అనుమతుల పత్రాన్ని మంత్రికి అందించారు. గుత్తేదారు సర్కిల్ చుట్టూ, గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఆయా హైవేల వైపు డివైడర్లు, మధ్యలో మొక్కలు నాటే పనులు పూర్తి చేశారు. ట్రాన్స్ ఫార్మర్స్, పోల్స్ షిఫ్టింగ్ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. నేడో, రేపో జంక్షన్ ను ప్రారంభింనున్నారు. కాగా, జంక్షన్ చుట్టూ వర్షపునీరు నిలవకుండా డ్రైన్లు, పాత్ వేలు, సైన్ బోర్డులు, పెయింట్, బీటీ లేయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనికి గానూ రెండో దశ టెండర్ ప్రక్రియ సైతం పూర్తయింది.