పింఛన్ ఫైల్ క్లియరెన్స్‌‌‌‌కు లంచం..ఏసీబీకి దొరికిన జీహెచ్‌‌‌‌ఎంసీ అకౌంట్స్ ఆఫీసర్

పింఛన్ ఫైల్ క్లియరెన్స్‌‌‌‌కు లంచం..ఏసీబీకి దొరికిన జీహెచ్‌‌‌‌ఎంసీ అకౌంట్స్ ఆఫీసర్

పద్మారావునగర్‌‌‌‌, వెలుగు: సికింద్రాబాద్ జీహెచ్‌‌‌‌ఎంసీ జోనల్ కార్యాలయంలో గురువారం ఏబీసీ అధికారులు దాడులు నిర్వహించి అకౌంట్స్​ ఆఫీసర్​ను లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, ఇదే కార్యాలయంలో ఆంజనేయులు అనే వ్యక్తి మజ్దూర్​గా పనిచేసి గతేడాది అక్టోబర్​లో రిటైర్డ్​ అయ్యాడు. పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ క్లియరెన్స్ కోసం అకౌంట్స్​ సెక్షన్​లో పత్రాలు సమర్పించాడు.

సెక్షన్ ఆఫీసర్ సంతోష్ కుమార్ ఆ ఫైల్‌‌‌‌ను హెడ్డాఫీస్‌‌‌‌కు పంపకుండా ఆరు నెలలుగా తన వద్దే ఉంచుకున్నాడు. ఫైల్​ క్లియరెన్స్​ కోసం రూ.40 వేలు డిమాండ్​ చేశాడు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో చివరకు రూ.35 వేలకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడు మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం సాయంత్రం బాధితుడి నుంచి సంతోష్​కుమార్​ రూ.35 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో మరెవరి ప్రమేయమేమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.