
- వరదలు, వాటి వల్ల ఎదురయ్యే నష్టాలకు చెక్ పెట్టేందుకు సర్వే
- ఖైరతాబాద్, ఎల్బీనగర్ లో పూర్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాల్లో వరదలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్ మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ముంబై, గుర్గావ్, భోపాల్ నగరాల్లో మాదిరిగా ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టం అమలు చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. బల్దియాను ఔటర్ వరకు విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో వరద నీటి కాల్వల గుర్తింపు, వర్షపు నీరు ఇంకే మార్గాలు, మూసీలో కలిసే దారులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో స్ర్టామ్ వాటర్ డ్రెయిన్ల లెక్క తేల్చాలని నిర్ణయించింది. ఇప్పటికే ఎల్బీనగర్, ఖైరతాబాద్ సర్కిల్స్ పరిధిలో ఫ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్(పీఓసీ) పేరుతో ఓ సర్వే చేయించింది. ఇలాగే, అన్ని సర్కిల్స్ లో చేయాలని నిర్ణయించింది. గ్రౌండ్ లెవెల్ లోనే కాకుండా డ్రోన్లతోనూ సర్వే చేయనున్నారు.
స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు జామ్
వర్షాలు పడిన టైంలో వరద రోడ్లపై చేరకుండా సాఫీగా వెళ్లేందుకు స్ర్టామ్ వాటర్ డ్రెయిన్లను బల్దియా నిర్మించింది. కొన్నిచోట్ల ఈ స్ర్టామ్ వాటర్ డ్రెయిన్లలో డ్రైనేజీ లైన్లను కలిపారు. కొందరు ఇంటి ఓనర్లు తమ ఇండ్లలోంచి వచ్చే మురుగునీటి పైపులను కూడా కలిపారు. ఈ నేపథ్యంలో స్ర్టామ్ వాటర్ డ్రెయిన్లు జామ్ అయి వర్షాలు పడిన సమయంలో నీరు వెళ్లడంలేదు. భారీ వర్షాల నేపథ్యంలో స్ర్టామ్ వాటర్ డ్రెయిన్ మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతాయి. ఈ సర్వేతో ఈ సమస్యకి కూడా చెక్ పడే అవకాశముంది.
మొబైల్ ఫీల్డ్ వర్కర్ టైప్ తో సర్వే
బల్దియా పరిధిలో నాలాలు, వరదనీటి కాల్వలు, చెరువులు గుర్తించడానికి ‘మొబైల్ ఫీల్డ్ వర్కర్ టైప్’ యాప్ ద్వారా సర్వే చేయనున్నారు. ఈ సాఫ్ట్వేర్ను ఇస్రీ (ఇండియా టెక్నాలజీస్ ప్రైవేట్లిమిటెడ్) సమకూర్చనున్నది.
వార్డుకో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) ను పెట్టి ఫ్లడ్ మేనేజ్ మెంట్ కు ఉన్న మార్గాలేమిటి? స్ర్టామ్ వాటర్ డ్రెయిన్లు ఎన్ని ఉన్నాయ్? గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఏమైనా ఉందా అని సర్వే చేయించనున్నారు. అలాగే వరదనీరు మూసీలో కలపడానికి ఏమైనా అవకాశం ఉందా అనే అంశాలపై పరిశీలించనున్నారు.
ఒక్కో స్ర్టామ్ వాటర్ డ్రెయిన్ మ్యాన్ హోల్స్ మూతకి యూనిక్ నెంబర్ ఇవ్వనున్నారు. ఎన్ని సెంటిమీటర్ల వర్షం పడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ముందుగానే గుర్తించనున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.