
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు శుక్రవారం నిరసనకు దిగారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీలో భాగమైన ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) కింద పనిచేస్తున్న 262 మంది డ్రైవర్లు, క్లీనర్లు హైడ్రా ఏర్పడిన తరువాత అక్కడ డ్యూటీ నిర్వహించారు. ఆ తరువాత హైడ్రా నుంచి తిరిగి జీహెచ్ఎంసీకి వచ్చారు. వీరికి జీతాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇవ్వడం లేదు.
తమకు రావాల్సిన జీతాలు ఇవ్వాలని అధికారులను కమిషనర్ఆదేశించినా అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, సీటీఓ( చీఫ్ ట్రాన్స్ ఫర్ ఆఫీసర్) శ్రీనివాస్ పట్టించుకోవట్లేదని ఆందోళన చేశారు. సీటీఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చివరకు కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి, తమకు న్యాయం చేయాలని కోరారు.