
- ప్రయోగాత్మకంగా 20 మందికి కోచింగ్ పూర్తి
- పదో తరగతి, ఇంటర్, ఆపై చదివిన వారికి అవకాశం
- 1ఎం1బీ ఫౌండేషన్తో త్వరలో యూసీడీ విభాగం ఒప్పందం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నిరుద్యోగులకు జీహెచ్ఎంసీ చేయూతను అందిస్తున్నది. ఫ్రీ కోచింగ్ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలను బల్దియా అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం (యూసీడీ) కల్పిస్తున్నది. ఈ మేరకు వన్ మిలియన్– వన్ బిలియన్(1ఎం1బీ) ఫౌండేషన్ తో జీహెచ్ఎంసీ త్వరలో పూర్తిస్థాయి ఒప్పందం చేసుకోనుంది. ఐదేండ్లపాటు ఈ సంస్థ జీహెచ్ఎంసీతో కలిసి ఇక్కడి యువతకు శిక్షణతో పాటు జాబ్ ప్లేస్ మెంట్ లను అందించనుంది. 18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉన్న వారికి ఈ శిక్షణ పొందే అవకాశం ఉంది.
ప్రయోగాత్మకంగా 20 మందితో ఫస్ట్ బ్యాచ్ను నిర్వహించారు. ఫస్ట్ బ్యాచ్ లో అందరు ట్రాన్స్ జెండర్లే ఉన్నారు. వీరికి ప్రొఫెషనల్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించి శిక్షణ ఇచ్చారు. వీరిలో ఆరుగురికి సర్టిఫికెట్లు అందజేశారు. త్వరలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదోతరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఆపై చదువులు చదివిన వారికి కూడా ఇందులో అవకాశాలు కల్పించనున్నారు. ఒప్పందం చేసుకున్న అనంతరం మరో బ్యాచ్ను స్టార్ట్ చేయనున్నారు. శిక్షణ కోసం ప్రత్యేకంగా టాస్క్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. క్లాస్లు వర్చువల్లో కూడా నిర్వహించనున్నారు. 5 ఏండ్లలో ఎంతమందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే అంశాలపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ చర్చించి ఆ తరువాత ఒప్పందం చేసుకోనున్నారు.