గువాహటి: మెడ గాయం కారణంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్లో ఒకర్ని కెప్టెన్గా నియమించే చాన్స్ ఉంది. అయితే అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ కూడా టీమ్లో ఉండటం వల్ల అతనికే నాయకత్వ పగ్గాలు అప్పగించొచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి.
‘గిల్ మెడ గాయానికి సంబంధించిన వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ముంబైలో ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకున్నాడు. కండరాల గాయమా, నరాల సంబంధిత సమస్యా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే అతనికి ఎక్కువ విశ్రాంతి అవసరమని నిర్ధారించారు. రిపోర్ట్స్ తర్వాత చికిత్సపై నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ ఫిట్నెస్తో వన్డే సిరీస్లో గిల్ ఆడటం అసాధ్యం’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
టెస్ట్ల్లో పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తుండటంతో అతనికే వన్డే పగ్గాలు కూడా ఇస్తారని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పంత్ వన్డేల్లో ఎక్కువగా ఆడలేదు. ఒకవేళ పంత్ లేకపోతే ఫస్ట్ చాయిస్ కీపర్గా రాహుల్ వైపు మొగ్గుతున్నారు. టీమ్ విషయానికొస్తే జైస్వాల్తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు.
అభిషేక్ శర్మను రిజర్వ్ ఓపెనర్గా ఉంచొచ్చు. హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్దీప్ సింగ్ పేస్ బాధ్యతను పంచుకోనున్నారు. తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్న హార్దిక్ టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. కుల్దీప్కు రెస్ట్ ఇచ్చి అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, సుందర్కు స్పిన్ బాధ్యతలు ఇవ్వొచ్చు.
