
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్ఎంపీ వైద్యం వికటించి కోమాలోకి పోయిన బాలిక
- కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రిలో
- చికిత్స పొందుతూ మృతి
- బాలిక ప్రాణానికి రూ. 5.20 లక్షలు ఖరీదు కట్టిన ఆర్ఎంపీ
చందుర్తి, వెలుగు: ఎనిమిదేళ్ల చిన్నారికి తేలు కుట్టిందని ఆర్ఎంపీ దగ్గరకు వెళితే ఇంజక్షన్లు వేయడంతో పది రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ.. చివరకు కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావసాపేట గ్రామానికి చెందిన కుదిరిగా సరిత, రమేశ్ దంపతులు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 19న సరిత సాగు చేస్తున్న పత్తి చేనులో కలుపు తీసేందుకు వెళ్లింది. కూతురు మహాల(8)కు జ్వరం రావడంతో చేనులోకి తీసుకెళ్లింది. చేనులో చిన్నారి మహాల రెండు కాళ్లకు తేలు కుట్టింది.
జోగాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ సంజీవ్ దగ్గరకు బాలికను తీసుకెళ్లగా నొప్పి తగ్గుతుందని ఇంజక్షన్ వేశాడు. తిరిగి రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో 20వ తేదీ తెల్లవారుజామున ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లగా మరో ఇంజక్షన్ వేశాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వేములవాడ పట్టణంలోని ప్రైవేటు వైద్యుడిని సంప్రదించారు. చిన్నారికి పల్స్ పడిపోతుందని వెంటనే కరీంనగర్ కు తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మహాల శనివారం చనిపోయింది. ఈ నెల 25న బాలిక తండ్రి రమేశ్ చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ కేసు నమోదు చేశారు. బాలిక వైద్య ఖర్చుల కింద కుటుంబానికి రూ. 5.20 లక్షలు ఇచ్చేందుకు ఆర్ఎంపీ ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్ఎంపీ సంజీవ్ ను శనివారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య తెలిపారు.