హైదరాబాద్, వెలుగు: బోయిన్పల్లిలోని ఫంక్షన్ హాల్స్ నుంచి వచ్చే శబ్దాలపై నివేదిక ఇవ్వాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ)ను హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఫంక్షన్ హాల్స్ ద్వారా వచ్చే ఇబ్బందులపై నెల రోజుల కిందట ఓ మిలిటరీ అధికారి హై కోర్టుకు లేఖ రాశారు. విచారణలో భాగంగా పై విధంగా స్పందించింది. బోయిన్పల్లిలోని బాంటియా గార్డెన్, సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్ల నుంచి రాత్రి పగలూ తేడా లేకుండా వచ్చే శబ్దాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు, నిద్ర లేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొందని మిలటరీ అధికారి తన లేఖలో వివరించారు.
రాత్రి 12 దాటినా శబ్దాలు ఆగడం లేదని, ఫంక్షన్ హాల్స్ ప్రాంతాల్లో నడవడానికి కూడా దారి లేకుండా ఇష్టం వచ్చినట్లు వాహనాల పార్కింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. డయల్ 100కు లేదా సమీప స్టేషన్ కు ఫోన్ చేసినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారని, ఆ తర్వాత మళ్లీ యథావిధిగా శబ్దాలు వస్తున్నాయని, విద్యార్థులకు పరీక్షలు ఉండగా చదువుకోలేక పోతున్నారని ఆ లేఖలో హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు పిల్గా విచారణకు స్వీకరించింది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత .. ప్రభుత్వ రూల్స్ మేరకు శబ్ద కాలుష్యం అనుమతించదగిన పరిమితుల్లో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. కంటోన్మెంట్ బోర్డును కూడా ప్రతివాదుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీకి చెప్పింది.