పటాన్చెరు, వెలుగు: ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న జాతీయ పాదయాత్ర బుధవారం పటాన్చెరుకు చేరుకుంది.
ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ఈ యాత్రకు నీలం మధు ఆధ్వర్యంలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాదయాత్ర చేపట్టిన వెంకటేశ్వర్లును సన్మానించారు.
