చదువుకు పెద్దపీట: ఉమ్మడి మెదక్ జిల్లాకు 9 తెలంగాణపబ్లిక్ స్కూళ్లు.. రూ.79కోట్లు మంజూరు

చదువుకు పెద్దపీట: ఉమ్మడి మెదక్ జిల్లాకు 9  తెలంగాణపబ్లిక్ స్కూళ్లు.. రూ.79కోట్లు మంజూరు
  •  సంగారెడ్డి జిల్లాలో ఐదు, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 
  • రెండు చొప్పున స్కూళ్ల ఎంపిక 
  •  కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా..
  •  సకల సౌకర్యాలతో టీపీఎస్ ల నిర్మాణం 

మెదక్, వెలుగు : విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్​ స్థాయి విద్యను అందించేందుకు ప్రైవేట్​ స్కూళ్లకు దీటుగా తెలంగాణ పబ్లిక్​ స్కూల్​ (టీపీఎస్​)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న హైస్కూల్స్, మోడల్​ స్కూల్స్​నే సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో టీపీఎస్​ లుగా అభివృద్ధి చేయనున్నారు. 

ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 9 స్కూళ్ల ను ఎంపిక చేశారు. వీటికి  రూ.79.60 కోట్లు మంజూరయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 5 టీపీఎస్​లు ఏర్పాటు కానుండగా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రెండు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కూళ్లలో  ప్రీ ప్రైమరీ మొదలుకుని ఇంటర్మీడియట్​​ వరకు  క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. 

రెండు మూడు ఎకరాల విస్తీర్ణం స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ జూనియర్​ కాలేజీలను అందులో విలీనం చేస్తారు. దాంతో ఒక్కో టీపీఎస్​ లో విద్యార్థుల సంఖ్య 1,000 నుంచి 1,500  వరకు ఉండనుంది. టీపీఎస్​ ల్లో డిజిటల్​ బోధనకు అనుగుణంగా ఆధునిక క్లాస్​ రూమ్​లు,  కంప్యూటర్​ ల్యాబ్​, లైబ్రరీ, మాడ్రన్​ కిచెన్,  సురక్షితమైన తాగునీరు తదితర సకల సౌకర్యాలు కల్పించనున్నారు. 

ఎక్కడెక్కడ.. ఏ స్కూల్​? 

  • మెదక్​ జిల్లాలో మెదక్ పట్టణంలోని గవర్నమెంట్​బాయ్స్​హైస్కూల్, వెల్దుర్తి మండలం కుకునూర్​జిల్లా పరిషత్​ హై స్కూల్​ ఎంపికయ్యాయి. మెదక్ స్కూల్​కు రూ.10 కోట్లు, కుకునూర్​ స్కూల్​ కు రూ.10 కోట్ల చొప్పున కేటాయించారు. 
  •  సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూర్​ జిల్లా పరిషత్  హైస్కూల్, దౌల్తాబాద్​లోని తెలంగాణ మాడల్​ స్కూల్​ ఎంపికయ్యాయి. చిన్నకోడూర్​ స్కూల్​ కు రూ.7.50 కోట్లు, దౌల్తాబాద్ స్కూల్​ కు రూ.7.80 కోట్లు మంజూరయ్యాయి.   
  • సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్​ నియోజకవర్గంలోని రంజోల్​ జిల్లా పరిషత్​ హైస్కూల్​కు రూ.10 కోట్లు, నిజాంపేట జిల్లా పరిషత్​ హైస్కూల్​ కు రూ.9.20 కోట్లు, మునిపల్లి తెలంగాణ మాడల్​ స్కూల్​ కు రూ.8.40 కోట్లు, జిన్నారం జడ్పీ హైస్కూల్​ కు రూ.7.90 కోట్లు, సదాశివపేట హైస్కూల్​కు రూ.8.80 కోట్లు మంజూరయ్యాయి