హనుమకొండ/ మధిర/ నర్సంపేట/ కాశీబుగ్గ, వెలుగు: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం మధిర, నర్సంపేట, హనుమకొండ, వరంగల్ చౌరస్తాల్లో నిర్వహించిన మీడియా సమావేశాలు, కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మారెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని విస్మరించరాదన్నారు.
హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం వేర్వేరు అని, వాటి చరిత్రను వాస్తవ ఆధారాలతో విడివిడిగా పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. పరకాల, భైరాన్పల్లి వంటి ఘటనలతో పాటు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన జాతీయవాదులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాలని అన్నారు. సెప్టెంబర్ 17కు పేర్లు మార్చినంత మాత్రాన చరిత్ర మారదని, రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించవద్దని సూచించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హనుమకొండలో కలెక్టర్కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు.
