- అమెరికా కంపెనీల ఒత్తిళ్లకు లొంగిన మోదీ
- రూ.2 వేల పైచిలుకు లావాదేవీల వాటా 65 శాతం
- అంతిమంగా జనంపైనే భారమని వ్యాఖ్య
- ఫ్యూచర్లో పర్సన్ టు పర్సన్ లావాదేవీలకూ ముప్పు
- ఇది డిజిటల్ పేమెంట్స్ ట్యాక్సే: ఏఐసీసీ చీఫ్ ఖర్గే
- ‘చార్జీల్లేవు’ హామీని విస్మరించారు: జైరాం రమేశ్
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలపై పరోక్షంగా చార్జీలు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మార్గం సుగమం చేసిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమెరికన్ పేమెంట్ కంపెనీల ఒత్తిళ్లకు లొంగిపోయారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదంతా ట్రంప్ను బుజ్జగించేందుకేనా? అంటూ ఫైర్ అయ్యారు. రూ. 2వేల కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (ఎండీఆర్) విధించేందుకు కేంద్రం అనుమతినిచ్చిందని రాహుల్ పేర్కొన్నారు.
ఈ లావాదేవీలు సంఖ్యాపరంగా కేవలం 5 శాతమే అయినప్పటికీ, మొత్తం లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం వాటా వీటిదేనని వివరించారు. వినియోగదారులపై నేరుగా ఎలాంటి రుసుము విధించబోమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వ్యాపారులపై మోపే ఎండీఆర్ భారం అంతిమంగా వస్తువుల ధరల పెంపు ద్వారా సాధారణ ప్రజల జేబుల నుంచే వసూలు అవుతుందని హెచ్చరించారు. దేశంలో అమలవుతున్న ‘జీరో- ఎండీఆర్ విధానాన్ని’ విదేశీ పేమెంట్ సంస్థలు మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నాయని, ఇప్పుడు వాటి ప్రయోజనాల కోసమే కేంద్రం ఈ మార్పులు తెచ్చిందని ఆరోపించారు.
ఇది డిజిటల్ పేమెంట్స్ ట్యాక్సే: ఖర్గే
ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుడి జేబులను ఖాళీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త మార్గాన్ని వెతుకుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యూపీఐపై ఎలాంటి చార్జీలు ఉండవు’’ అన్న హామీని ‘‘రూ.2 వేల వరకు మాత్రమే చార్జీలు ఉండవు” అని మార్చేసి, ప్రజలపై ‘డిజిటల్ పేమెంట్స్ పన్ను’ వేసేందుకు రంగం సిద్ధం చేశారని అన్నారు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం సవరణ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో రూ. 2 వేల లోపు మాత్రమే మినహాయింపు ఉందని, అంతకుమించిన లావాదేవీలకు ఎలాంటి స్పష్టమైన రక్షణ లేదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో సాధారణ వ్యక్తిగత బదిలీలపైనా (పర్సన్ టు పర్సన్) చార్జీలు వేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
