దేవుడు చేరమంటేనే బీజేపీలో చేరిన..

దేవుడు చేరమంటేనే బీజేపీలో చేరిన..

గోవాలో ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన దిగంబర్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దేవుడి అనుమతితోనే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు సైతం అదే ఫాలో అయ్యారంటూ కామెంట్స్ చేశారు.  గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాలు దక్కించుకుంది. అందులో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలో చేరారు. ఎన్నికల సందర్భంగా పార్టీకి కట్టుబడి ఉంటామని దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లోనూ ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో చేసిన ఆ హామీలను వారు కనీసం 10 నెలలు కూడా నిలబెట్టుకోలేకపోయారు. ప్రతిజ్ఞ చేసిన 7 నెలలకే పక్క పార్టీలోకి చేరిపోయారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారందరికీ మాజీ సీఎం దిగంబర్ కామత్ ప్రాతినిథ్యం వహించారు. ఇటీవలే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో బీజేపీ కండువాలు కప్పుకున్న ఈ నేత.. తాజాగా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. తాము బీజేపీలోకి చేరాలనుకున్నపుడు ఆలయాన్ని వెళ్లి దేవున్ని అడిగానని చెప్పారు. తమ మనసులో ఉన్న కోరికను విన్నవించుకోగా... ఆ దేవుడు తమను ఏం పర్లేదు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండని చెప్పినట్టు కామత్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.