కార్మిక కాలనీల్లో తాగునీటి కష్టాలకు చెక్

కార్మిక కాలనీల్లో తాగునీటి కష్టాలకు చెక్
  • గోదావరిఖనిలో శరవేగంగా ఆర్‌‌‌‌జీఎఫ్‌‌ ప్లాంట్​నిర్మాణం
  • సింగరేణి ఆర్జీ 1, 2, 3 ఏరియాలకు రోజూ 35 ఎంఎల్‌‌డీ వాటర్​సప్లై చేసేలా ప్లాన్​
  • తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మేనేజ్‌‌మెంట్ చర్యలు

గోదావరిఖని, వెలుగు: రామగుండం ప్రాంతంలో కోల్‌‌బెల్ట్‌‌ వాసులకు ఇక తాగునీటి కష్టాలు తొలగనున్నాయి. రూ.14 కోట్లతో నిర్మిస్తున్న ర్యాపిడ్​ సాండ్​ గ్రావిటీ ఫిల్ట్రేషన్​(ఆర్‌‌‌‌జీఎఫ్‌‌) ప్లాంట్​మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నది. గోదావరి నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి రోజుకు 35 ఎంఎల్‌‌డీ వాటర్‌‌‌‌ను సింగరేణి ఆర్జీ 1, ఆర్జీ 2, ఆర్జీ 3 ఏరియాలలోని కార్మిక కాలనీలతో పాటు పారిశ్రామిక ప్రాంత వాసులకు అందించనున్నారు.

వర్షాకాలం వస్తే రంగు నీళ్లే దిక్కు

గోదావరి ఒడ్డున సింగరేణికి చెందిన ఇన్‌‌ఫిల్ట్రేషన్​ గ్యాలరీల ద్వారా మోటర్ల సాయంతో ఫిల్టర్​బెడ్​లోకి నీటిని చేర్చి అక్కడి నుంచి పంప్​హౌస్​లో శుద్ధి చేసి కార్మిక కాలనీలకు సప్లై చేసేవారు. వర్షాకాలంలో నీరు సరిగ్గా శుద్ధి కాక ప్రజలు అవస్థలు పడేవారు. ఎరుపు రంగులో వస్తుండడంతో ఆ నీటిని తాగలేక కార్మిక కుటుంబాలు ఆర్‌‌‌‌వో ప్లాంట్ల నుంచి డబ్బులు చెల్లించి నీళ్లు కొనుక్కునేవారు. ఈ క్రమంలో సింగరేణి పలు ఏరియాల్లో ఆర్​వో ప్లాంట్లను ఏర్పాటు  చేసింది. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కరం చూపడానికి మేనేజ్​మెంట్​ నిర్ణయించింది. 

రూ.14 కోట్లతో ఆర్‌‌‌‌జీఎఫ్‌‌ ప్లాంట్​నిర్మాణం

సింగరేణి రామగుండం ప్రాంతంలో గోదావరిఖని, యైటింక్లయిన్​ కాలనీ, సెంటినరీకాలనీలలో నివసించే కార్మిక కాలనీలకు, పలు ఏరియాల్లోని ప్రైవేటు ఇళ్లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో రూ.14 కోట్లతో ఆర్‌‌‌‌జీఎఫ్‌‌ ప్లాంట్​ నిర్మాణాన్ని జీడీకే 2, 2ఏ గనుల సమీపంలో హైదరాబాద్​కు చెందిన ఓ కంపెనీ చేపట్టింది. 20 ఎంఎల్‌‌డీ,15 ఎంఎల్‌‌డీల సామర్థ్యం గల ప్లాంట్‌‌లుగా విభజించి రోజుకు 35 ఎంఎల్‌‌డీ వాటర్​ను శుద్ధిచేసేలా నిర్మాణాలు చేస్తున్నారు.

 ఇప్పటివరకు 20 ఎంఎల్‌‌డీ ప్లాంట్​ 90 శాతం, 15 ఎంఎల్​డి ప్లాంట్​ 75 శాతం పూర్తయ్యాయి. నెల రోజుల్లో సివిల్​ వర్క్స్​ పూర్తి చేయనుండగా వచ్చే సెప్టెంబర్​నాటికి మెకానికల్‌‌ పనులు పూర్తిచేసి కార్మిక కుటుంబాలకు నీటిని సప్లై చేసేందుకు మేనేజ్‌‌మెంట్‌‌ చర్యలు తీసుకుంటున్నది. మరో రూ.8 కోట్లతో గోదావరి నుంచి ఆర్‌‌‌‌జీఎఫ్‌‌ ప్లాంట్​ వరకు మెయిన్​ పైప్​లైన్లు, ఇంటర్నల్​ పైప్​లైన్లను బిగించే పనులు చేపట్టనున్నారు. 

స్వచ్ఛమైన తాగునీటిని సప్లై చేస్తాం

సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటి సప్లై చేయడమే లక్ష్యంగా కంపెనీ పనిచేస్తుంది. అందుకే గోదావరి నది నీటిని శుద్ధి చేసి సప్లై చేసేందుకు ర్యాపిడ్​గ్రావిటీ ఫిల్ట్రేషన్​ ప్లాంట్‌‌ను నిర్మిస్తున్నాం. రాబోయే రోజుల్లో తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు శాశ్వతంగా ఈ ప్లాంట్​నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే నిర్మాణం పూర్తయి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురానున్నాం. - డి.లలిత్​ కుమార్​, సింగరేణి ఆర్జీ 1 జీఎం