
- గోదావరిఖనిలో శరవేగంగా ఆర్జీఎఫ్ ప్లాంట్నిర్మాణం
- సింగరేణి ఆర్జీ 1, 2, 3 ఏరియాలకు రోజూ 35 ఎంఎల్డీ వాటర్సప్లై చేసేలా ప్లాన్
- తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మేనేజ్మెంట్ చర్యలు
గోదావరిఖని, వెలుగు: రామగుండం ప్రాంతంలో కోల్బెల్ట్ వాసులకు ఇక తాగునీటి కష్టాలు తొలగనున్నాయి. రూ.14 కోట్లతో నిర్మిస్తున్న ర్యాపిడ్ సాండ్ గ్రావిటీ ఫిల్ట్రేషన్(ఆర్జీఎఫ్) ప్లాంట్మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నది. గోదావరి నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి రోజుకు 35 ఎంఎల్డీ వాటర్ను సింగరేణి ఆర్జీ 1, ఆర్జీ 2, ఆర్జీ 3 ఏరియాలలోని కార్మిక కాలనీలతో పాటు పారిశ్రామిక ప్రాంత వాసులకు అందించనున్నారు.
వర్షాకాలం వస్తే రంగు నీళ్లే దిక్కు
గోదావరి ఒడ్డున సింగరేణికి చెందిన ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా మోటర్ల సాయంతో ఫిల్టర్బెడ్లోకి నీటిని చేర్చి అక్కడి నుంచి పంప్హౌస్లో శుద్ధి చేసి కార్మిక కాలనీలకు సప్లై చేసేవారు. వర్షాకాలంలో నీరు సరిగ్గా శుద్ధి కాక ప్రజలు అవస్థలు పడేవారు. ఎరుపు రంగులో వస్తుండడంతో ఆ నీటిని తాగలేక కార్మిక కుటుంబాలు ఆర్వో ప్లాంట్ల నుంచి డబ్బులు చెల్లించి నీళ్లు కొనుక్కునేవారు. ఈ క్రమంలో సింగరేణి పలు ఏరియాల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కరం చూపడానికి మేనేజ్మెంట్ నిర్ణయించింది.
రూ.14 కోట్లతో ఆర్జీఎఫ్ ప్లాంట్నిర్మాణం
సింగరేణి రామగుండం ప్రాంతంలో గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, సెంటినరీకాలనీలలో నివసించే కార్మిక కాలనీలకు, పలు ఏరియాల్లోని ప్రైవేటు ఇళ్లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో రూ.14 కోట్లతో ఆర్జీఎఫ్ ప్లాంట్ నిర్మాణాన్ని జీడీకే 2, 2ఏ గనుల సమీపంలో హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీ చేపట్టింది. 20 ఎంఎల్డీ,15 ఎంఎల్డీల సామర్థ్యం గల ప్లాంట్లుగా విభజించి రోజుకు 35 ఎంఎల్డీ వాటర్ను శుద్ధిచేసేలా నిర్మాణాలు చేస్తున్నారు.
ఇప్పటివరకు 20 ఎంఎల్డీ ప్లాంట్ 90 శాతం, 15 ఎంఎల్డి ప్లాంట్ 75 శాతం పూర్తయ్యాయి. నెల రోజుల్లో సివిల్ వర్క్స్ పూర్తి చేయనుండగా వచ్చే సెప్టెంబర్నాటికి మెకానికల్ పనులు పూర్తిచేసి కార్మిక కుటుంబాలకు నీటిని సప్లై చేసేందుకు మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటున్నది. మరో రూ.8 కోట్లతో గోదావరి నుంచి ఆర్జీఎఫ్ ప్లాంట్ వరకు మెయిన్ పైప్లైన్లు, ఇంటర్నల్ పైప్లైన్లను బిగించే పనులు చేపట్టనున్నారు.
స్వచ్ఛమైన తాగునీటిని సప్లై చేస్తాం
సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటి సప్లై చేయడమే లక్ష్యంగా కంపెనీ పనిచేస్తుంది. అందుకే గోదావరి నది నీటిని శుద్ధి చేసి సప్లై చేసేందుకు ర్యాపిడ్గ్రావిటీ ఫిల్ట్రేషన్ ప్లాంట్ను నిర్మిస్తున్నాం. రాబోయే రోజుల్లో తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు శాశ్వతంగా ఈ ప్లాంట్నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే నిర్మాణం పూర్తయి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురానున్నాం. - డి.లలిత్ కుమార్, సింగరేణి ఆర్జీ 1 జీఎం