Gold News: గోల్డ్ బాంబ్.. తులం రేటు రూ.2లక్షల 70వేలు పక్కా ఐతది..! సంచలన రిపోర్ట్

Gold News: గోల్డ్ బాంబ్.. తులం రేటు రూ.2లక్షల 70వేలు పక్కా ఐతది..! సంచలన రిపోర్ట్

Gold Rate Forecast: ప్రస్తుతం భారతదేశంలో తులం బంగారం ధర కొద్దిగా అటూ ఇటుగా రూ.లక్ష మార్కును చేరిపోయింది. ఈ పెరిగిన ధరలు చూసి చాలా మందికి కొనాలనే మాట వినిపిస్తేనే కళ్లు తిరుగుతున్నాయి. అయితే రానున్న కాలంలో బంగారం ధరలు మూడింతల వరకు పెరగవచ్చని వచ్చిన రిపోర్ట్ భారతీయ మధ్యతరగతితో పాటు ధనవంతులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే లీచ్టెన్‌స్టెయిన్‌కు చెందిన పెట్టుబడి సంస్థ ఇంక్రిమెంటమ్ "గోల్డ్ వి ట్రస్ట్ రిపోర్ట్ 2025" పేరుతో బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే దానిపై ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో రానున్న ఐదేళ్లలో బంగారం ధరలు భారీగా పెరిగి 2030 నాటికి ఔన్సు అంటే 28.35 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.7లక్షల 56 వేలకు చేరుకుంటుందని పేర్కొంది. అంటే ఈ లెక్కన తులం బంగారం రేటు రూ.2లక్షల 70వేలకు చేరుకుంటుందని తెలుస్తోంది. 

అయితే కేవలం ఐదేళ్ల కాలంలో బంగారం ధరలు మూడింతలు కావటానికి వెనుక కీలక కారణాలను ఈ రిపోర్ట్ పేర్కొంది. ఔన్సు గోల్డ్ రేటు 8వేల 900 డాలర్లకు చేరటానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు వంటి అంశాలు ప్రధాన ప్రేరేపకాలుగా ఉన్నాయని రిపోర్ట్ వెల్లడించింది. దీనికి తోడు సెంట్రల్ బ్యాంకుల విధానాలు, అంతర్జాతీయ రాజకీయ ధోరణులు దీర్ఘకాలంలో గోల్డ్ డిమాండ్, వాటి ధరలను భారీగా పెంచుతాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం పెరుగుతున్న గోల్డ్ రేట్లు దీర్ఘకాలంలో పెరుగుదలకు కేవలం ప్రారంభం మాత్రమేనని రిపోర్ట్ వెల్లడించింది.

2025 ప్రారంభం నుంచి ఏప్రిల్ వరకు గోల్డ్ రేట్లు ఏకంగా 25 శాతం పెరగటం సాధారణ భారతీయుడిని సైతం ఆందోళనకు గురిచేస్తోంది. రిపోర్ట్ పేర్కొన్నట్లు ఇదే కొనసాగితే రానున్న కాలంలో గోల్డ్ కొనటం సామాన్యులకు ఒక కలగా మిగిలిపోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు, ఫ్యామిలీ ఆఫీసులు తమ మెుత్తం పెట్టుబడుల్లో కేవలం 1 శాతం మాత్రమే బంగారం లేదా ఇతర విలువైన లోహాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వారు ఎక్కువగా రియల్టీ, ప్రైవేట్ ఈక్విటీ, ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటున్నారు. 

JP మోర్గాన్ రిపోర్ట్ ఇదే..

దీనికి ముందు గతవారం అమెరికాలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ గోల్డ్ ధరలపై తన అంచనాలను వెల్లడిస్తూ ఔన్సు రేటు 2029 నాటికి 6వేల డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించింది. అంటే తులం బంగారం రేటు రూ.లక్ష 80వేలకు చేరుకుంటుందని తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ధరల కంటే దాదాపు 80 శాతం పెరుగుదలను ఇది సూచిస్తోంది. నిజంగా ఇదే జరిగితే భవిష్యత్తులో రోల్డ్ గోల్డ్ వస్తువులతోనే ప్రజలు సంతోషపడాల్సిన పరిస్థితి రావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.