పాలమూరు యూనివర్సిటీకి..మంచి రోజులు..PMUSHA రూ.వంద కోట్లు మంజూరు

పాలమూరు యూనివర్సిటీకి..మంచి రోజులు..PMUSHA రూ.వంద కోట్లు మంజూరు
  •     వర్సిటీకి అదనంగా రూ.20 కోట్లు రిలీజ్​ చేసిన రేవంత్​ సర్కార్
  •     రూ.20 కోట్లతో బాయ్స్, గర్ల్స్​ హాస్టళ్ల నిర్మాణం

మహబూబ్​నగర్/ మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు: పదేండ్ల తర్వాత పాలమూరు యూనివర్సిటీ(పీయూ)కి మంచి రోజులు వచ్చాయి. ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్​(పీఎంయూఎస్​హెచ్ఏ) స్కీం కింద రూ. వంద కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్సిటీ డెవలప్​మెంట్​కు ఇటీవల రూ.20 కోట్లు కేటాయించింది. ఈ ఫండ్స్​తో వర్సిటీలో మౌలిక సదుపాయాలు, గర్ల్స్​, బాయ్స్​ హాస్టళ్లు, ఇతర భవనాల నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.120  కోట్లు 

2023లో పీఎం యూఎస్​హెచ్ఏ స్కీమ్​కు అప్లై చేసుకోవాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పాలమూరు యూనివర్సిటీ ఆఫీసర్లు డెవలప్​మెంట్​ పనులకు సంబంధించిన ప్రపోజల్స్​ సిద్ధం చేసి రాష్ట్ర సర్కారుకు పంపారు. అనంతరం పీఎంయూఎస్​హెచ్ఏ కోఆర్డినేటర్​ సీఎం రేవంత్​రెడ్డి ద్వారా కేంద్రానికి ప్రపోజల్స్​ పంపారు. ఈ ప్రపోజల్స్​ను పరిశీలించిన కేంద్రం.. పీయూకు ఫండ్స్​ రిలీజ్​ చేసింది. 

దేశంలోని 26 యూనివర్సిటీలకు రూ.వంద కోట్ల ఫండ్స్​ కేటాయించగా, అందులో పీయూకు చోటు కల్పించింది. ఈ ఫండ్స్​ ద్వారా వర్సిటీలో కొత్తగా రూ.20 కోట్లతో గర్ల్స్, బాయ్స్​ హాస్టళ్లు నిర్మించనున్నారు. ఇతర అకడమిక్​ బిల్డింగులు, స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్, రీసెర్చ్  డెవలప్ మెంట్​ కోసం ఫండ్స్​ ఖర్చు చేయనున్నారు. కాగా, కేంద్రం నుంచి 2017లో వర్సిటీకి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఫండ్స్​తో ఎగ్జామినేషన్  బ్రాంచ్, గెస్ట్ హౌస్, సోలార్  సిస్టం ఏర్పాటు, సీసీ రోడ్ల కోసం వెచ్చించారు. నిధులు పూర్తిగా సద్వినియోగం కావడంతో రెండోసారి కేంద్రం పీయూను ఈ స్కీం కింద గుర్తించి పెద్ద మొత్తంలో ఫండ్స్​ మంజూరు చేసింది.

ఏడేండ్లలో రెండు సార్లే..

గత ప్రభుత్వం ఏడేండ్లలో పీయూకు బడ్జెట్​లో డెవలప్​మెంట్​ కోసం రెండు సార్లు మాత్రమే బడ్జెట్​ కేటాయించింది. 2017–18 రాష్ట్ర బడ్జెట్​లో జీతాల కోసం రూ.5.7 కోట్లు కేటాయించగా, డెవలప్​మెంట్​ కోసం రూ.10 కోట్లను విడుదల చేసింది. 2018–19లో జీతాల కోసం రూ.6.7 కోట్లు కేటాయించింది. 2019–-20లో జీతాలకు రూ.6.63 కోట్లు ఇవ్వగా, రూ.90 లక్షలు మాత్రమే డెవలప్​మెంట్​ కోసం రిలీజ్​ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు డెవలప్​మెంట్​కు పైసా ఇవ్వలేదు. కాగా 2013లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నల్లారి కిరణ్​కుమార్​ రెడ్డి పీయూను సందర్శించి రూ.16 కోట్లు డెవలప్​మెంట్​ కోసం రిలీజ్​ చేశారు. మళ్లీ పదేండ్లకు అదే కాంగ్రెస్​ గవర్నమెంట్​ రూలింగ్​లోకి రాగానే పీయూకు ప్రాధాన్యత ఇచ్చింది. వర్సిటీ డెవలప్​మెంట్​ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20 కోట్లు రిలీజ్​ చేసింది.

పీయూ విశేషాలు..

2008లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్సార్​​పాలమూరు వర్సిటీని ఏర్పాటు చేశారు. 176 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీని నిర్మించారు. దీని పరిధిలో నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబ్​నగర్​ జిల్లాల్లో 90 డిగ్రీ కాలేజీలు ఉండగా, అందులో 22 గవర్నమెంట్​ కాలేజీలు ఉన్నాయి. అలాగే ఒక అటానమస్​ కాలేజ్(ఎంవీఎస్​), మూడు ట్రైబల్​ వెల్ఫేర్, మూడు సోషల్​ వెల్ఫేర్, మూడు మహాత్మా జ్యోతిబా ఫూలే కాలేజీలున్నాయి. 

వర్సిటీలో ప్రస్తుతం 18 రకాల పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో ఆర్గానిక్​ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ, ఇండిగ్రేటెడ్​ కెమిస్ట్రీ(ఐదేండ్లు), ఎంఏ ఇంగ్లిష్, ఎకానమిక్స్, పొలిటికల్​ సైన్స్, ఎంకాం, ఎంఎస్​డబ్ల్యూ, ఎంఏ తెలుగు, ఎంఈడీ, ఎం ఫార్మసీ, రెగ్యులేటరీ ఎపిమర్స్, ఫార్మకాలజి, ఎంబీఏ, ఎంసీఏ, కంప్యూటర్​ సైన్స్  కోర్సులున్నాయి. పీయూ పరిధిలో 10,074 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుకుంటున్నారు.

 స్టూడెంట్లకు  మేలు జరుగుతుంది

గత ప్రభుత్వం పీయూను పట్టించుకోలేదు. పీయూ డెవలప్​మెంట్​కు రూ.వంద కోట్లు మంజూరు కావడం ఆక్సిజన్  లాంటిది. వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంజూరైన ఫండ్స్​తో స్టూడెంట్లకు  మేలు జరుగుతుంది. రాష్ట్ర సర్కారు కూడా పీయూను డెవలప్​ చేసే బాధ్యత తీసుకుంది. వర్సిటీలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 కోట్లు మంజూరు చేసింది. దీంతో వర్సిటీకి మంచి రోజులు వస్తాయి.
–యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే

రూమ్స్​ లేక ఇబ్బందులు..

గర్ల్స్, బాయ్స్  హాస్టల్స్​ ఇరుకుగా ఉన్నాయి. ఫైనాన్స్  కోర్సులకు క్లాస్  రూమ్స్​ లేవు. ఎన్విరాన్మెంటల్, తెలుగు, ఎంసీఏ స్టూడెంట్లకు క్లాస్  రూమ్స్ లేక ల్యాబ్​లో కూర్చోబెడుతున్నారు. ప్రస్తుతం మంజూరైన ఫండ్స్​తో అడిషనల్​ క్లాస్​ రూమ్స్​ కట్టించాలి. కొత్త హాస్టళ్లు నిర్మించాలి.
–బత్తిని రాము, పీయూ జేఏసీ కన్వీనర్