
- 365 ఎకరాల్లో..రూ.300 కోట్లతో ఏర్పాటు
- తుది దశకు చేరిన పనులు
- ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు సన్నాహాలు
- స్థానికంగానే రైతులు పంటను అమ్ముకునే చాన్స్
- ఫ్యాక్టరీతో వేలాది యువతకు లభించనున్న ఉపాధి
సిద్దిపేట, వెలుగు : తెలంగాణలో తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమవుతోంది. జూన్ నెలాఖరులో షురూ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 2023లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో 65 ఎకరాల్లో రూ. 300 కోట్లతో చేపట్టిన ఫ్యాక్టరీ పనులు తుది దశకు చేరాయి.
ఇప్పటికే అశ్వారావుపేట, అప్పారావు పేటల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు ఉండగా.. క్రూడ్ ఆయిల్ ను తీసిన తర్వాత రాజేంద్రనగర్ లోని ఆయిల్ ఫెడ్ సంస్థకు పంపి రిఫైన్డ్ చేయిస్తున్నారు. ప్రస్తుతం నర్మెటలో నిర్మించేది తొలి రిఫైన్డ్ ఫ్యాక్టరీగా గుర్తింపు పొందనుంది. దీన్ని కాలుష్య రహితంగా నిర్మిస్తుండగా.. ఫ్యాక్టరీ నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.
ఇక్కడ పామాయిల్ గెలల నుంచి తీసిన క్రూడ్ ఆయిల్ ను రిఫైన్డ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్మకానికి తరలిస్తారు. ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీలో గంటకు 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఉత్పత్తి పెరిగే కొద్దీ క్రషింగ్ సామర్థ్యం కూడా పెంచుకునే విధంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్మిస్తుండగా.. ఇటీవల సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఈనెలాఖరులోనే ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే.
దేశీయంగా రైతులను ప్రోత్సహించేందుకు..
దేశీయ అవసరాల కోసం విదేశాల నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకుంటుండగా తద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో దేశీయంగా రైతులను పామాయిల్ సాగు వైపు మళ్లించి ప్రోత్సహించే ఆలోచనతో సిద్దిపేట ప్రాంతంలో రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
రాష్ట్రంలో 60 వేలకు మందికిపైగా రైతులు 2.50 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలను సాగు చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో పాటు కోతుల బెడద లేకుండా నాలుగేండ్లలోనే పంట కోతకు వస్తుంది. అదేవిధంగా పామాయిల్ సాగుతో మూడు దశాబ్దాల పాటు నికర లాభాలు ఆర్జించే చాన్స్ ఉండడంతో రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గత నాలుగేండ్లలో పామాయిల్ సాగు లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ వ్యవసా య, ఉద్యాన, సెరికల్చర్ విభాగాల అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవలే సిద్దిపేట జిల్లాలో మొదటి దిగుబడి ప్రారంభమైంది.
స్థానికంగానే గెలలు అమ్ముకోవచ్చు
నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో స్థానికంగానే రైతులు పామాయిల్ గెలలను అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాతో పాటు సమీప కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, హనుమకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాలకు చెందిన రైతులకు నర్మెట ఫ్యాక్టరీ అందుబాటులో ఉండనుంది. ఇకముందు స్థానికంగానే పంటను అమ్ముకునే వీలు ఉండడంతో పామాయిల్ సాగు వైపు రైతులు క్రమంగా ఆసక్తి చూపుతున్నారు.
వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి
పామాయిల్ గెలల వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను కూడా ఫ్యాక్టరీ ఆవరణలో నిర్మిస్తున్నారు. వ్యర్థాలను ఉడికించి ఆధునిక టర్బైన్లతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఫ్యాక్టరీ అవసరాలకు వాడుకునే అవకాశం ఉంటుంది.
వేలాది మందికి ఉపాధి
నర్మెట రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభించనుంది. ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా పనిచేసేందుకు 500 మందికి జాబ్ లు లభిస్తే.. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరకనుంది. ఇటీవల మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు.