బెంగళూరులో గూగుల్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో అతడితో పాటు పని చేసిన వారిని కూడా క్వారంటైన్ చేశారు వైద్య అధికారులు. 14 రోజుల పాటు వారిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తారు. ఈ విషయాన్ని గూగుల్ ఇండియా శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ‘బెంగళూరులోని మా ఆఫీసులో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా ఉందని తేలింది. అతడిలో కరోనా లక్షణాలను గుర్తించే కొన్ని గంటల ముందు కూడా ఆఫీసులో పని చేశాడు. కరోనా లక్షణాలు బయటపడిన నాటి నుంచే అతడిని క్వారంటైన్లో ఉండాలని సూచించాం. అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆఫీసులో ఉండగా ఆ ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ క్వారంటైన్లో ఉంచి డాక్టర్లు పరీక్షిస్తున్నారు’ అని వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం బెంగళూరు ఆఫీసులోని ఉద్యోగులందరినీ వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించినట్లు తెలిపింది గూగుల్. ఆరోగ్య శాఖ అధికారుల సూచనలతో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది ఆ కంపెనీ.
చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా బారినపడి ఇప్పటికే 4500 మందికి పైగా మరణించారు. దాదాపు లక్షా 25 వేల మంది వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. భారత్లోనూ రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం నాటికి 81 మందికి వైరస్ సోకింది. దేశంలోనే తొలి కరోనా మరణం కర్ణాటకలో సంభవించింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన 76 ఏళ్ల వయసున్న ఓ వృద్ధుడు గురువారం మరణించినట్లు కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.