
లండన్: ఇంగ్లండ్తో లార్డ్స్ టెస్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత ఆటతీరుపై ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. జడేజా ఆట నమ్మశక్యం కాని పోరాటమని కొనియాడాడు. మూడో టెస్టులో ఇండియా 22 రన్స్ తేడాతో ఓడిపోయినప్పటికీ జడేజా 181 బాల్స్లో 61 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. బీసీసీఐ వెబ్సైట్లో శుక్రవారం పోస్ట్ చేసిన స్పెషల్ వీడియోలో గంభీర్ మాట్లాడుతూ జడేజా ఆ మ్యాచ్లో చేసిన పోరాటం అద్భుతమని అన్నాడు. 193 రన్స్ టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో ఇండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.
టాప్–8బ్యాటర్లు 40 ఓవర్లలోపే పెవిలియన్ చేరారు. కానీ, ఏడో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన జడేజా టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్తో పట్టుదలగా క్రీజులో నిలిచాడు. ఈ ముగ్గురూ కలిసి 34 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి విజయంపై ఆశలు రేపారు. జడేజా బ్యాటింగ్పై టీమ్ కోచింగ్ స్టాఫ్ కూడా ప్రశంసలు కురిపించింది. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దష్కటే మాట్లాడుతూ ‘జడేజా బ్యాటింగ్ ఇప్పుడు మరో లెవెల్కు చేరుకుంది. గత రెండు టెస్టుల్లో అతను చూపిన నిలకడ, ప్రశాంతత అద్భుతం. పటిష్టమైన డిఫెన్స్తో ఒక మంచి బ్యాటర్లా కనిపిస్తున్నాడు’ అని అన్నాడు. బ్యాటింగ్ కోచ్, డొమెస్టిక్ క్రికెట్లో జడేజా మాజీ సౌరాష్ట్ర టీమ్మేట్ సితాన్షు కోటక్ కూడా అతడిని పొగిడాడు. ‘జడ్డూకు ఎంత ఒత్తిడిని అయినా తట్టుకునే సామర్థ్యం ఉంది. తనకున్న అనుభవంతో ఎలాంటి సవాల్లోనైనా జట్టుకు అవసరమైనదాన్ని అందిస్తాడు. అతను జట్టుకు ఎంతో విలువైన ఆటగాడు’ అని పేర్కొన్నాడు. జడేజా లాంటి ఆల్రౌండర్ దొరకడం కష్టమని పేసర్ సిరాజ్ అన్నాడు. అలాంటి ప్లేయర్ జట్టులో ఉండటం తమ అదృష్టమని అభిప్రాయపడ్డాడు.