13 మంది వీఐపీలకు NSG భద్రత తొలగింపు

13 మంది వీఐపీలకు NSG భద్రత తొలగింపు

దేశం మొత్తం మీద 13 మంది ప్రముఖులకు కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) భద్రతను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. వీరందరి సెక్యూరిటీని పారా మిలిటరీ దళాలు చూస్తాయని స్పష్టం చేసింది. మోడీ ప్రభుత్వం రెండోదఫా అధికారాన్ని చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా 350 మంది VIPలకు భద్రతను తగ్గించింది. సోనియా గాంధీ ఫ్యామిలీ, మన్మోహన్ సింగ్ వంటి ప్రముఖులు ఈ లిస్టులో ఉన్నారు. గడచిన 20 ఏళ్లుగా బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలుచుకునే NSG టీంలు… VIPల భద్రతలో ఉంది. జడ్ ప్లస్ విభాగంలో ఉన్న వారందరి భద్రతనూ వీరు పర్యవేక్షిస్తున్నారు.

ఒక్కొక్కరికీ 25 మంది బ్లాక్ క్యాట్ కమాండోల చొప్పున భద్రతను కేంద్రం కల్పించగా, ఈ వీఐపీల జాబితాలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తో పాటు రాజ్ నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, శర్వానంద సోనోవాల్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ఎల్కే అద్వానీ, ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులున్నారు.

1984లో హైజాక్ ఆపరేషన్స్ కోసం ఈ దళాన్ని ఏర్పాటు చేశామని, ప్రముఖుల భద్రత వీరి పరిధిలోనిది కాదని, ఈ బాధ్యతలు అదనపు భారం కావడంతోనే వారిని తప్పించామని హోమ్ శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 450 మంది NSG కమాండోలు అందుబాటులోకి వస్తారని అన్నారు. ఇండియాలో ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున, వీరిని ఆయా ప్రదేశాలకు హుటాహుటిన తరలించడానికి అనుకూలంగా.. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.