పని చేసేందుకు పైసలు డిమాండ్‌‌‌‌..ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులు

పని చేసేందుకు పైసలు డిమాండ్‌‌‌‌..ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులు
  • ఆదిలాబాద్‌‌‌‌లో మున్సిపల్​అకౌంట్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, సూర్యాపేటలో విలేజ్‌‌‌‌ సెక్రటరీ

ఆదిలాబాద్‌‌‌‌టౌన్‌‌‌‌/పెన్‌‌‌‌పహాడ్‌‌‌‌, వెలుగు : తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించేందుకు సైతం లంచం డిమాండ్‌‌‌‌ చేసిన ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ ఆఫీసర్లు గురువారం పట్టుకున్నారు. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో మున్సిపల్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, సూర్యాపేట జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే... ఆదిలాబాద్‌‌‌‌ మున్సిపాలిటీలో రెండేండ్ల కింద రూ. 60 లక్షల నిధులతో సీసీ రోడ్లు, సైడ్‌‌‌‌ డ్రైన్లు నిర్మించి హైమాస్ట్‌‌‌‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్‌‌‌‌కు రూ. 3.80 లక్షల బిల్లు రావాల్సి ఉండడంతో నిధులు విడుదల చేయాలని మున్సిపల్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ బట్ట రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ను కలిశాడు.

బిల్లు మంజూరు చేయాలంటే రూ. 15 వేలు ఇవ్వాలని రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్‌‌‌‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారి సూచనతో గురువారం డబ్బులు ఇస్తుండగా అకౌంట్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌తో పాటు, కంప్యూటర్‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌ కొండ్ర రవికుమార్‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. వారిని కరీంనగర్‌‌‌‌ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ మధు తెలిపారు.

ఎన్‌‌‌‌వోసీ కోసం రూ.15 వేలు డిమాండ్‌‌‌‌

బొగ్గు బట్టి ఏర్పాటుకు ఎన్‌‌‌‌వోసీ జారీ చేసేందుకు లంచం డిమాండ్‌‌‌‌ చేసిన సూర్యాపేట జిల్లా పెన్‌‌‌‌పహాడ్‌‌‌‌ మండలం నాగులపాటి అన్నారం సెక్రటరీ అనంతుల సతీశ్‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బొగ్గు బట్టీ ఏర్పాటు చేసుకునేందుకు ఎన్‌‌‌‌వోసీ ఇవ్వాలని ఈ నెల 6న గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీశ్‌‌‌‌ను కలిశాడు. ఎన్‌‌‌‌వోసీ కోసం రూ. 15 వేలు ఇవ్వాలని సెక్రటరీ డిమాండ్‌‌‌‌ చేయడంతో రూ. 8 వేలు ఇచ్చేందుకు సదరు వ్యాపారి ఒప్పుకున్నాడు.

తర్వాత ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు సెక్రటరీతో మాట్లాడిన ఆడియోను అందజేశాడు. దీంతో నల్గొండ రేంజ్‌‌‌‌ ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌‌‌‌ చంద్ర తన సిబ్బందితో కలిసి గురువారం గ్రామపంచాయతీ ఆఫీస్‌‌‌‌కు వచ్చి ఎంక్వైరీ చేసిన అనంతరం సతీశ్‌‌‌‌కుమార్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. సెక్రటరీని హైదరాబాద్‌‌‌‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.