
- మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు
- పెరగనున్న పీజీ సీట్లు.. పల్లెలకు అందనున్న మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు
- ఎన్ఎంసీ చైర్మన్కు మెడికల్ కాలేజీల పరిస్థితిని వివరించిన మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదు పెద్దాసుపత్రుల్లో పీజీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లోని 200 బెడ్స్ కు పైనున్న ఆస్పత్రులకు అనుసంధానంగా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా సీట్లు పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మల్టీ స్పెషాలిటీ వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పీజీ సీట్ల పెంపు ఆవశ్యకతను ఎన్ఎంసీ చైర్మన్ కు వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించడంతో ఈ ఏడాది నుంచి పీజీ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే.. 1,190 పీజీ సీట్లు మాత్రమే ఉన్నాయి.
మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య పెంచడంతో పాటు, మెడికల్ కాలేజీలు లేని ప్రాంతంలో ఉన్న పెద్ద హాస్పిటల్స్లోనూ పీజీ సీట్లకు ఈ సంవత్సరం నుంచి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇవ్వనుంది. మన రాష్ట్రంలో 5 ఆస్పత్రుల్లో పీజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీజీ సీట్ల సంఖ్య పెంచుకోవడానికి, గ్రామీణ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ఈ సెంటర్లు ఉపయోగపడనున్నాయి.
ప్రస్తుతం ఎంబీబీఎస్ డాక్టర్లకు పెద్దగా డిమాండ్ లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో 30, 40 వేలకు మించి జీతాలు ఇవ్వడం లేదు. అందుకే ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేయడానికి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు. నోటిఫికేషన్ ఇస్తే ఒక్కో పోస్టుకు ఐదారుగురు దరఖాస్తు చేస్తున్నారు. పీజీ(స్పెషాలిటీ) డాక్టర్లకు అటు ప్రైవేటులో, ఇటు గవర్నమెంట్ సెక్టార్లోనూ మంచి డిమాండ్ ఉంది.
మంచి జీతాలు ఇస్తున్నారు. కానీ, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఎక్కువగా ఉండి, పీజీ సీట్ల సంఖ్య తక్కువగా(1:4) ఉండడం వల్ల ప్రతి నలుగురు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్లో ఒక్కరికే పీజీ చేసే అవకాశం దక్కుతోంది. ఈ నేపథ్యంలో పీజీ సీట్ల పెంపు, ఒక వరంలా ఎంబీబీఎస్ డాక్టర్లు భావిస్తున్నారు. సీట్ల సంఖ్య పెంచాలని పలుమార్లు ప్రభుత్వానికి ఇప్పటికే మెడికల్ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ల ఆవేదనను, పీజీ సీట్ల పెంపు ఆవశ్యకతను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎన్ఎంసీ చైర్మన్ కు వివరించిన విషయం తెల్సిందే.
మంత్రి సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్ఎంసీ చైర్మన్ మెడికల్ కాలేజీలతో పాటు, పెద్ద హాస్పిటల్స్లోనూ పీజీ సీట్లు ఏర్పాటు చేసుకునేలా అనుమతులు ఇస్తామని హామి ఇచ్చారు. రాష్ట్రంలోని కింగ్కోఠి, పెద్దపల్లి, బాన్సువాడ, గజ్వేల్, భద్రాచలం, మిర్యాలగూడ, హుస్నాబాద్ లో 200 కంటే ఎక్కువ బెడ్లు ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో ఐదింటిలో పీజీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
పల్లెల్లో అందనున్న మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు
పీజీ సీట్ల పెంపుతో మారుమూల పల్లెలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు విస్తరించేందుకు మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ కొరతను అధిగమించడంతోపాటు డాక్టర్లకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఏళ్లుగా మారుమూల పల్లెల్లో నాణ్యమైన వైద్య సేవలు అందక ఎంతోమంది మరణిస్తు వస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందక అక్కడి గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పీహెచ్ సీ లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నా అవి పూర్తి స్థాయిలో అందడం లేదనే విమర్శలు ఉన్నాయి.