V6 News

గ్రేటర్ హైదరాబాద్ లో 300 వార్డులు!..నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

గ్రేటర్ హైదరాబాద్ లో 300 వార్డులు!..నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
  •  వార్డుల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ నేడు? 
  • తర్వాత వారం పాటు అభ్యంతరాలకు అవకాశం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ ఎంసీలో వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు గ్రేటర్ లో విలీనం అవ్వడంతో వార్డుల సంఖ్య పెరిగింది. జీహెచ్ ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను కమిషనర్ సమర్పించారు. 

ఈ అధ్యయనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్  ఆధ్వర్యంలో చేపట్టింది. జీహెచ్ ఎంసీ పరిధిలో పెరిగిన జనాభా, పట్టణ విస్తరణను పరిగణనలోకి తీసుకొని జీహెచ్ ఎంసీ చట్టం 1955(సెక్షన్ 8, సెక్షన్ 5) నిబంధనల ప్రకారం కొత్త వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. ఈ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రార్డినరీ గెజిట్లో ప్రచురించాలని ఆదేశించారు. 

ముద్రణ శాఖకు 500 ప్రతులను అందించాలని కూడా సూచించారు. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన, భవిష్యత్తులో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనుంది. వార్డుల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ నేడు(మంగళవారం) విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వారం పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వనుంది. ఆ తర్వాత మార్పులు, చేర్పులు చేసి నోటిఫికేషన్ ఫైనల్ చేయనుంది.